ఢిల్లీ: అసెంబ్లీలో చట్టబద్ధంగా ఆమోదించుకుని ముందుకు వెళ్తున్నాం అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బిసి రిజర్వేషన్లపై తమకు చిత్తశుద్ధి ఉంది అని అన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..వాస్తవంగా అన్ని రకాల రిజర్వేషన్లకు బిజెపి వ్యతిరేకం అని బిసి రిజర్వేషన్లపై చట్టసవరణ బిల్లు, ఆర్డినెన్స్ ను అడ్డుకుంటున్నదే బిజెపి నేతలు అని విమర్శించారు. బిజెపి నేతలు రిజర్వేషన్ల బిల్లును అసెంబ్లీలో ఆమోదించి ఇప్పుడు మాట మారుస్తున్నారని, బిజెపి నేతలకు చిత్తశుద్ధి ఉంటే.. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి బిల్లులను ఆమోదింపజేయాలని పొన్నం సూచించారు.
బిజెపి ఫ్యూడలిస్టు పార్టీ.. ఎస్సి, ఎస్టి, బిసి రిజర్వేషన్లకు బిజెపి వ్యతిరేకమని, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ హెచ్ సియూలో ఎస్సిలకు వ్యతిరేకంగా పోరాటాలు చేశారని మండిపడ్డారు. శాసనసభలో మద్దతు ఇచ్చిన బిజెపి, బిఆర్ఎస్ న్యాయప్ర్రకియలోనూ సహకరించాలని, ప్రామాణికమైన లెక్కల ద్వారానే బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నామని తెలియజేశారు. సామాజిక స్పృహ కలిగిన వారంతా ప్రభుత్వంతో కలిసి రావాలని, జనాభా ప్రాతిపదికగా బిసిలకు రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించామని అన్నారు. బిసిలకు 42 శాతం రిజర్వేషన్ల వల్ల ఎవరి హక్కులకు భంగం కలగదు అని జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉపఎన్నికలోనూ కాంగ్రెస్ దే విజయమని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.