మన తెలంగాణ / హైదరాబాద్ : హైదరాబాద్, సికిందరాబాద్ జంట నగరాల్లో ఆర్టిసి ఛార్జీలు మొదటి మూడు స్టేజీలకు రూ.5 లు, నాలుగవ స్టేజీకి రూ.10ల చొప్పున పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సిపిఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా వ్యతిరేకించింది. పెంచిన ఛార్జీలను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేసింది. కొత్త డిపోలు, కొత్త ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటుకు రూ. 392 కోట్లు ఖర్చు అవుతుందని, ఈ ఛార్జీలను పెంచుతున్నట్లు, అందుకు ప్రజలు సహకరించాలని ప్రభుత్వం చెప్పడం హాస్యాస్పదంగా ఉందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్లో ఎలక్ట్రికల్ బస్సు చార్జీలను, బస్సు పాస్ చార్జీలను భారీగా పెంచిందని, పండగల పేరుతో ప్రజల నుండి 50 శాతం ప్రత్యేక చార్జీలు వసూలు చేస్తూనే ఉన్నారని, మౌలిక సదుపాయాలకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించకుండా ప్రజలపై మరోసారి అదనంగా భారాలు వేయడం సమంజసం కాదని ఆయనన్నారు.
కార్గో సేవలు కొనసాగాంచాలి
ఆర్టిసి కార్గో సర్వీసులను ప్రైవేటీకరించడానికి ప్రయత్నిస్తున్నట్లు వార్తలొస్తున్నాయని జాన్ వెస్లీ తెలిపారు. కార్గో సేవలను ప్రైవేటీకరించాలనే ప్రయత్నాలను విరమించుకొని ఆర్టిసిలోనే కార్గోసేవలను కొనసాగిస్తూ ప్రజలకు మరింత అందుబాటులోకి తేవాలని ఆయన డిమాండ్ చేశారు. అవసరమైతే అదనపు సిబ్బందిని రిక్రూట్ చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.