స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని అన్ని స్థానాల్లోనూ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురేయడమే లక్ష్యంగా పనిచేయాలని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పిలుపు నిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ సమన్వయ లోపం రాకుండా చూసుకోవాలని ఆదేశించారు. శనివారం రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిలతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీధర్ బాబు భేటీ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అంశాలపై వారికి మంత్రి దిశా నిర్దేశం చేశారు. ప్రతి నియోజక వర్గంలో పార్టీ బలం, బలహీనతలు, గత ఎన్నికల ఫలితాలపై సమీక్ష నిర్వహించారు.
ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు, గత ప్రభుత్వ వైఫల్యాలు, అక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. ప్రతి నియోజకవర్గంలో క్షేత్రస్థాయి సర్వే నిర్వహించిన తర్వాతే అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని మంత్రి శ్రీధర్బాబు వెల్లడించారు. అభ్యర్థుల ఎంపికపై ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జిల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటామని, అయితే తుది నిర్ణయం మాత్రం పార్టీ అధిష్టానం తీసుకుంటుందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో రంగారెడ్డి డీసీసీ ప్రెసిడెంట్ చల్లా నర్సింహా రెడ్డి, ఎమ్మెల్యేలు మల్ రెడ్డి రంగారెడ్డి( ఇబ్రహీంపట్నం), టి. రామ్మోహన్ రెడ్డి (పరిగి), కసిరెడ్డి నారాయణ రెడి ్డ(కల్వకుర్తి), కె.శంకరయ్య(షాద్ నగర్), బి. మనోహర్ రెడ్డి(తాండూరు), కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంఛార్జీలు కేఎల్ఆర్(మహేశ్వరం), భీం భరత్( చేవెళ్ల) తదితరులు పాల్గొన్నారు.