పంజాబ్ నేషనల్ బ్యాంక్ను రూ. వేల కోట్ల మేర మోసగించి బ్రిటన్ పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ అప్పగింత వ్యవహారం ఓ కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. అతడిని భారత్కు అప్పగించేందుకు మార్గం సుగమమైనట్టు సమాచారం. నవంబరు 23న నీరవ్ ను భారత అధికారులకు అప్పగించే అవకాశాలున్నట్టు ఆంగ్ల మీడియా కథనాలు వెల్లడించాయి.అప్పగించే ప్రక్రియకు సంబంధించి భారత ప్రభుత్వం బ్రిటిష్ అధికారులకు తాజాగా హామీ పత్రం అందజేసింది. నీరవ్ను భారత్కు తీసుకొచ్చాక కేవలం మోసం, మనీలాండరింగ్ కేసుల్లో మాత్రమే విచారిస్తామని , ఇతర ఏజెన్సీల కస్టడీకి ఇవ్వబోమని అందులో పేర్కొన్నట్టు సమాచారం. సీబీఐ, ఈడీ సీరియస్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్, కస్టమ్స్, ఆదాయపు పన్ను విభాగం సంయుక్తంగా ఈ హామీ పత్రాన్ని అందజేసినట్టు సదరు కథనాలు వెల్లడించాయి.
అంతేగాక భారత్కు అప్పగించిన తరువాత నీరవ్ మోడీని ముంబై లోని ఆర్థర్ రోడ్ జైల్లో ఉంచనున్నట్టు అందులో పేర్కొన్నారట. అతడికి హై ప్రొఫైల్ ఖైదీలకు అందించే సౌకర్యాలు కల్పిస్తామని వెల్లడించినట్టు సమాచారం. తన అప్పగింత ప్రక్రియను సవాల్ చేస్తూ ఇటీవల నీరవ్ మోడీ మరోసారి కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తనను భారత్కు అప్పగిస్తే దేశం లోని బహుళ విచారణ సంస్థలు దర్యాప్తు పేరుతో చిత్రహింసలకు గురి చేస్తాయని అతడు తన పిటిషన్లో పేర్కొన్నాడు. ఈ కేసు మొత్తాన్ని తిరిగి ప్రారంభించాలని అభ్యర్థించాడు. ఈ పిటిషన్ను లండన్ కోర్టు అంగీకరించింది. ఈ క్రమం లోనే భారత దర్యాప్తు సంస్థలు హామీ పత్రాన్ని సమర్పించాయి. దీన్ని పరిగణన లోకి తీసుకున్న న్యాయస్థానం నవంబరు 23న తదుపరి విచారణ సమయంలో అతడిని భారత్కు అప్పగించే అవకాశాలున్నట్టు సదరు కథనాలు పేర్కొన్నాయి.
కేసు పూర్వాపరాలు
తప్పుడు ఎల్వోయులతో పీఎన్బీని ( పిఎన్బి స్కామ్ ) నీరవ్ మోడీ మోసగించిన వైనం 2019 జనవరిలో వెలుగుచూసింది. దీంతో ఈ కుంభకోణంపై ఈడీ, సీబీఐ దర్యాప్తు ప్రారంభించాయి. అయితే అప్పటికే అతను దేశం విడిచి పారిపోయాడు. ఈడీ అతడిని పరారైన ఆర్థిక నేరగాడిగా ప్రకటించింది. నీరవ్ తమ దేశం లోన నివసిస్తున్నాడని 2018 డిసెంబరులో బ్రిటన్ ప్రభుత్వం భారత్కు తెలియజేసింది. అతడిని అప్పగించాలని భారత్ విజ్ఞప్తి చేసింది. 2019 మార్చిలో నీరవ్ను అక్కడి పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. అతడిని భారత్కు అప్పగించడానికి 2021లో అప్పటి బ్రిటన్ హోం మంత్రి ప్రీతి పటేల్ ఉత్తర్వులు జారీ చేశారు. వీటిని సవాల్ చేస్తూ అతడు లండన్ హైకోర్టులో అప్పీల్ చేసుకున్నప్పటికీ కోర్టు తిరస్కరించింది. బెయిల్ కోసం దరఖాస్తు చేసినా అన్నిసార్లు భంగపాటుకు గురయ్యాడు.