తెలంగాణ జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎస్టి నేత ఎల్. రూప్ సింగ్ నాయక్ను సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నియమించారు. విజయ దశమి సందర్భంగా గురువారం రెండో విడత రాష్ట్ర కమిటీని కవిత ప్రకటించారు. తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యవర్గంలో 80 శాతానికిపైగా పదవులను బడుగు బలహీన వర్గాలకు కట్టబెట్టారు. ఈ మేరకు తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యవర్గాన్ని సామాజిక కోణంలో ప్రకటించారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా కల్వకుంట్ల కవిత పర్యటించనున్నారు. జిల్లా పర్యటనల్లో మేధావులు, కవులు, కళాకారులు, వివిధ రంగాల నిపుణులతో సమావేశం కానున్నారు. ప్రజలతో పాటు ఆయా రంగాల ప్రముఖుల సలహాలు, సూచనల మేరకు త్వరలో తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యవర్గం మూడో విడత ప్రకటన ఉంటుందని కల్వకుంట్ల కవిత తెలిపారు. జాగృతిలో కొత్త బాధ్యతలు అప్పగించిన వారు సంస్థ ఆశయాలకు అంకితమై పని చేయాలని ఆమె సూచించారు. ఈ నియామకాలు వెంటనే అమలులోకి వస్తాయని కవిత పేర్కొన్నారు.