మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని పల్లెల్లో ఎన్నికల హడావుడి ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నుంచే ఎన్నికల కోడ్ తక్షణమే అమల్లోకి వచ్చింది. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉండనుంది.ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో, ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై ఆంక్షలు ఉంటాయి. ఎన్నికల సందర్భంగా అక్రమ నగదు రవాణా అరికట్టేందుకు అధికారులు కఠిన నిబంధనలు అమలు చేస్తారు. సోమవారం నుంచి ఎన్నికల కోడ్ ముగిసే వరకు ఒక సామాన్య వ్యక్తి రూ. 50 వేల వరకు మాత్రమే నగదు తీసుకెళ్లడానికి అనుమతి ఉంటుంది.ఎన్నికల కమిషన్ సూచించిన దానికంటే ఒక్క రూపాయి ఎక్కువ ఉన్నా, సరైన పత్రాలు లేకపోతే ఆ నగదును అధికారులు సీజ్ చేస్తారు.
ఎక్కువ మొత్తంలో నగదు దొరికితే.. ఎన్నికల అధికారులు ఐటీ, జిఎస్టి అధికారులకు సమాచారం అందించి ఆ డబ్బును కోర్టులో జమ చేస్తారు. తక్కువ మొత్తంలో దొరికిన డబ్బును రెవెన్యూ అధికారుల వద్ద జమ చేస్తారు.అత్యవసర వైద్యం, కళాశాల ఫీజులు, వ్యాపారం, పెళ్లిళ్లు వంటి ముఖ్యమైన అవసరాలకు పెద్ద మొత్తంలో నగదు తీసుకెళ్లేవారు తప్పనిసరిగా సరైన ఆధారాలు వెంట ఉంచుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. ఈ పత్రాలను చూపించగలిగితే.. జప్తు చేసిన డబ్బును తిరిగి ఇస్తారు. బ్యాంకు లావాదేవీల్లో నగదు డ్రా చేసిన అకౌంట్ పుస్తకం లేదా ఎటిఎం రిసిప్ట్, వ్యాపార లావాదేవీల్లో వస్తువులు లేదా ధాన్యం విక్రయించిన డబ్బు అయితే దానికి సంబంధించిన బిల్లులు, ఆస్తి లావాదేవీల్లో భూమి విక్రయించిన సొమ్ము అయితే దానికి సంబంధించిన డాక్యుమెంట్లు, వ్యాపారం లేదా సేవల ద్వారా వచ్చిన డబ్బు అయితే లావాదేవీల పూర్తి వివరాలు అధికారులకు సమర్పించాలి.