గవర్నర్ ఆమోదించక పోతే రాజ్ భవన్ ముట్టడి
బిసి సంక్షేమ సంఘం జాతీయ అద్యక్షులు జాజుల
మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిసి రిజర్వేషన్ల బిల్లును గవర్నర్ జిస్ణుదేవ్ వర్మ ఇప్పటికైనా ఆమోదించాలని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. ఆదివారం సచివాలయం మీడియా పాయింట్ వద్ద బిసి సంఘాల నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం బిసి రిజర్వేషన్లు పెంచుతూ తెచ్చిన జిఓ నెంబర్ 9ని సవాల్ చేస్తూ రెడ్డి జాగృతికి చెందిన నాయకులు హైకోర్టులో పిటిషన్ వేసి అడ్డుకోవాలని చూశారని బిసిల వైపు న్యాయం ఉంది కాబట్టే హైకోర్టు బిసి రిజర్వేషన్ల విషయంలో జోక్యం చేసుకోలేదని ఆయన తెలిపారు.
బిసి రిజర్వేషన్లు సంపూర్ణంగా అమలు కావాలంటే బిసి రిజర్వేషన్లను గవర్నర్ ఆమోదం తెలపాలని రాష్ట్ర హైకోర్టు సూచించిందని, హైకోర్టులో బిసి రిజర్వేషన్లు నిలబడాలంటే తక్షణమే గవర్నర్ ఆమోదించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గవర్నర్ కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేస్తున్నందున బిజెపికి చెందిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు తక్షణమే గవర్నర్ను కలిసి బిసి రిజర్వేషన్ల చట్టానికి ఆమోదించేలా కృషి చేయాలని జాజుల డిమాండ్ చేశారు. బిసి రిజర్వేషన్లకు అసెంబ్లీలో రెండుసార్లు మద్దతు పలికిన బిజెపి గవర్నర్ కలిసి ఆమోదింపజేశాల కృషి చేస్తే బిజెపికి బిసిల మద్దతు ఉంటుందన్న విషయాన్ని వారు గ్రహించాలని సూచించారు.
బిసి రిజర్వేషన్లు పెంచకుండా రాష్ట్ర గవర్నర్ నాన్చివేత వైఖరి అవలంబిస్తే రాష్ట్రవ్యాప్తంగా వేలాదిమంది బిసిలను కలుపుకొని వచ్చే అఖిలపక్ష పార్టీలతో రాజ్ భవన్ ను ముట్టడిస్తామని శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. ఈ సమావేశంలో బిసి దళ్ జాతీయ అధ్యక్షులు దండ్రు కుమారస్వామి, బిసి విద్యావంతుల వేదిక రాష్ట్ర కన్వీనర్ ప్రొఫెసర్ సంఘని మల్లేశ్వర్, బిసి కల్చరల్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు వరంగల్ శ్రీనివాస్, బిసి జాగృతి రాష్ట్ర అధ్యక్షులు మురళీకృష్ణ, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.