దేశంలో రెండో గ్రామంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వగ్రామం
సీఎం సొంతూరులో ప్రతి ఇంటికీ సౌర విద్యుత్ ప్లాంట్
దక్షిణ భారత దేశంలో మొదటి గ్రామంగా గుర్తింపు
సౌర విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ. 10.53 కోట్లు
ప్రతి ఇంటి నుండి నెలకు 360 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి
సెప్టెంబర్ లో విద్యుత్ గ్రిడ్కు గ్రామం నుండి సుమారు లక్ష యూనిట్ల విద్యుత్ ఎగుమతి
రూ 5 లక్షలు ఆదాయాన్ని ఆర్జించిన గ్రామస్తులు
మన తెలంగాణ / హైదరాబాద్ : సంపూర్ణ సౌర విద్యుత్ గ్రామంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లి గుర్తింపు పొందనుంది. రాష్ట్రంలో పూర్తిగా సోలార్ ఆధారిత విద్యుత్ వినియోగ గ్రామంగా సీఎం రేవంత్రెడ్డి సొంతూరు కొండారెడ్డిపల్లిని తీర్చిదిద్దారు.నాగర్ కర్నూల్ జిల్లా వంగూర్ మండలంలో అచ్చంపేట నియోజకవర్గం పరిధిలో కొండారెడ్డిపల్లి గ్రామం ఉంది. దేశంలో రెండో గ్రామంగా, దక్షిణ భారతదేశంలో మొదటి గ్రామంగా తీర్చిదిద్దుటకు చేపట్టిన పనులు దాదాపు పూర్తయ్యాయి. టిజి రెడ్కో ద్వారా రూ 10.53 కోట్లతో 514 ఇండ్లతో , పాటు 11 ప్రభుత్వ భవనాలకు సౌర విద్యుత్ ప్రాజెక్టును ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రతి ఇంటికి 3 కిలో వాట్ల స్థాపిత సామర్ధ్యంతో 480 ఇండ్లకు సౌర విద్యుత్ వసతిని కల్పించారు. అలాగే 60 కిలో వాట్ల సామర్ధ్యం కలిగిన 11 ప్రభుత్వ భవనాలకు సౌర విద్యుత్ పరికరాలు బిగించారు. మొత్తం సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యం 1,500 కిలోవాట్లు ఉంది. మట్టి గోడలతో ఉన్న 34 ఇండ్ల కుటుంబాలు కూడా సౌర విద్యుత్ పరికరాలు ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నాయి.
ఈ కుటుంబాలకు ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తయిన వెంటనే ఇండ్ల పైన సౌర విద్యుత్ పరికరాలు బిగించనున్నట్లు టిజి రెడ్కో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మేనేజర్ కె. మనోహర్ రెడ్డి తెలిపారు. కొండారెడ్డిపల్లి గ్రామం సౌర విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ. 10.53 కోట్లు. అందులో రూ.7.96 కోట్ల వ్యయంతో సౌర విద్యుత్ పరికరాలు ఏర్పాటుకు కేటాయించారు. సౌర విద్యుత్ కు కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ రూ.3.56 కోట్లు ,మెజర్స్ ప్రీమిర్ ఎనర్జీన్ కంపెనీ నుండి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధుల నుండి రూ 4.92 కోట్లు భరించారు. మరో రూ 2.59 కోట్లను మౌలిక వసతుల అభివృద్ధికి ఖర్చు చేశారు. ప్రతి ఇంటి నుండి నెలకు 360 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది.(ప్రతి కిటోవాట్ కు 120 యూనిట్స్ అవుతుంది) ఇళ్ల నుండి ఉత్పత్తి అయ్యే విద్యుత్ ను ఇంటి వినియోగానికి పోగా మిగిలిన విద్యుత్ ను గ్రిడ్ కు అనుసంధానం చేశారు. గ్రిడ్ కు పంపే విద్యుత్ యూనిట్ కు రూ 5.25 చొప్పున చెల్లించుటకు లబ్దిదారులతో విద్యుత్ పంపిణీ సంస్థ ఒప్పందం చేసుకుంది. సెప్టెంబర్ నెలలో విద్యుత్ గ్రిడ్కు గ్రామం మొత్తం నుండి సుమారు ఒక లక్ష యూనిట్ల విద్యుత్ ఎగుమతి అయింది. తద్వారా రూ 5 లక్షలు ఆదాయాన్ని గ్రామస్తులు ఒక నెలలోనే ఆర్జించారు.
పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజనలో భాగంగా దేశవ్యాప్తంగా జిల్లాకో గ్రామాన్ని సోలారైజ్డ్గా మార్చేందుకు కేంద్రం ఒక్కో పల్లెకు రూ.కోటి చొప్పున ఇస్తోంది. ఈ పథకాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర సర్కారు కొండారెడ్డిపల్లితో పాటు మధిర నియోజకవర్గంలోని ఓ గ్రామాన్ని ఎంపిక చేసింది. వీటిలో తొలుత కొండారెడ్డిపల్లిని సోలారైజ్డ్గా మార్చారు. నాగర్కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో గృహ విద్యుత్ వినియోగదారులు 499 దాకా ఉండగా వీరికి డిమాండ్ ఆధారంగా 1 కిలోవాట్ నుంచి 3 కిలోవాట్ల దాకా రూఫ్టాప్ సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. 66 వాణిజ్య కనెక్షన్లకు కూడా డిమాండ్ ఆధారంగా రూఫ్టాప్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. 867 వ్యవసాయ కనెక్షన్లకు 7.5 కిలోవాట్ల చొప్పున ప్లాంట్లు పెట్టారు. పీఎం కుసుమ్ కింద వ్యవసాయ సోలార్ మోటార్ కనెక్షన్లు ఇచ్చారు. కొండారెడ్డిపల్లిలో అన్ని కేటగిరీలు కలుపుకుని 1,451 కనెక్షన్లు ఉన్నట్లు గుర్తించారు. పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన కింద 3 కిలోవాట్ల దాకా ఇళ్లపై సౌర ఫలకాలు పెట్టుకోవడానికి దరఖాస్తు పెట్టుకున్న వారికి సబ్సిడీ అందనుంది. 2 కిలోవాట్ల దాకా మొత్తం వ్యయంలో 60 శాతం(గరిష్ఠంగా రూ.60 వేలు) 3 కిలోవాట్ల కేటగిరీలో 2 కిలోవాట్ల దాకా రూ.60 వేలు, అదనంగా ఒక కిలోవాట్కు రూ.18 వేలు కలిపి రూ.78 వేలు సబ్సిడీ రూపంలో అందనుంది. సీఎం ఆదేశాలతో మంగళవారం నుంచి గ్రామంలో ఇంటింటి సర్వే చేపట్టారు. దక్షిణ డిస్కమ్ సీఎండీ ముషారఫ్ అలీ, నాగర్కర్నూల్ కలెక్టర్ బదావత్ సంతోష్, రెడ్కో సీఎండీ అనిల గ్రామంలో పర్యటించి సోలార్ ప్రాజెక్టు ప్రయోజనాలను వివరించారు.
ఇక కొండారెడ్డిపల్లిలో మొత్తం కనెక్షన్లకు కలిపి 5 మెగావాట్ల డిమాండ్ ఉంటుందని, ఒక మెగావాట్కు రూ.3 కోట్ల చొప్పున రూ.15 కోట్లు అవుతాయని ప్రాథమికంగా అంచనా వేశారు. వారం రోజుల్లో డీపీఆర్ను సిద్ధం చేసి ప్రభుత్వానికి అందించనున్నారు. దాంతో కేంద్రం సహాయం కింద అందే రూ.కోటితో పాటు రూఫ్టాప్ సోలార్, పీఎం కుసుమ్ అన్నీ కలిపి రూ.5 కోట్ల దాకా సహాయం అందే అవకాశాలు ఉండగా మరో రూ.10 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించింది.