రూ. 87,695 కోట్ల రుణాల ఫ్రీజ్
చెల్లింపులకు సుదీర్ఘ అవకాశం
సేవలు నిలిచిపోకుండా ఊతం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు టెలికం సంస్థ వోడాఫోన్ ఐడియా లిమిటెడ్ (విఐఎల్) సంస్థకు భారీ ఊరట కల్పించింది. ఈ కంపెనీ చెల్లించాల్సిన రూ 87,695 కోట్ల రుణాలను ఫ్రీజ్ చేసింది. రుణాల చెల్లింపులపై ఐదేండ్ల పాటు అమలులో ఉండే మారిటోరియం విధించింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రి మండలి సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. రుణాల ఫ్రీజ్ అంటే కంపెనీ సర్దుబాట్ల స్థూల ఆదాయం (ఎజిఆర్) ప్రాతిపదికన చెల్లించాల్సిన రుణాల చెల్లింపును తాత్కాలికంగా వాయిదా వేయడం. కాలపరిమితి కల్పించడం. పూర్తి స్థాయిలో కుంటుపడే పరిస్థితిలో ఉన్న ఈ కంపెనీకి కేంద్రం నిర్ణయం అత్యంత కీలకమైన జీవనదానం (లైఫ్లైన్) గా మారింది. ఇప్పటికిప్పుడు చెల్లించాల్సిన బకాయిలను ఇక ఇప్పటి వెసులుబాటు కల్పన సంబంధిత మంత్రి మండలి నిర్ణయంతో చెల్లింపులను 2031 32 ఆర్థిక సంవత్సరం నుంచి ఆరంభించి , మొత్తం బకాయిలను 204041 వరకూ పూర్తిగా చెల్లించాల్సి ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి.
వోడాఫోన్ ఐడియా కంపెనీల బకాయిలను 2020 సెప్టెంబర్లో సుప్రీంకోర్టు రూలింగ్ మేరకు ఖరారు చేశారు. ఇవి మొత్తం మీద 2031 ఆర్థిక సంవత్సరానికి పూర్తిగా చెల్లించాల్సి ఉంది. ఇప్పుడు చెల్లింపుల ఆరంభ గడువును పెంచారు. వోడాఫోన్ కంపెనీ చాలా కాలంగా ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. తీవ్రస్థాయి ధరల పోటీ, అత్యధిక రుణాలు, భారీ స్థాయి ఎజిఆర్ చెల్లింపులు వంటి తీవ్ర స్థా సమస్యలు ఉన్నాయి. ఓ వైపు క్రమేపీ వినియోగదారుల సంఖ్య తగ్గుతూ ఉండటం, నాణ్యత పోటీ, ప్రామాణికత నిర్వహణకు అత్యధిక వనరుల సమస్య వంటి వాటివి కీలక సమస్యలు అయ్యాయి. నెట్వర్క్ విస్తరణ అవసరాలకు అనుగుణంగా చేయలేకపోడంతో , మరో వైపు ప్రత్యర్థి కంపెనీల సేవలలో 4 జి, 5జి ప్రసార సాంకేతికతను ప్రవేశపెట్టడం, దీనిని ఈ కంపెనీ అందుకోలేకపోవడంతో సమస్యలు సంకట స్థితికి చేర్చాయి. ఈ దశలోనే మోడీ ప్రభుత్వం ఈ కంపెనీకి ఊపిరిపోసినట్లు అయింది. కంపెనీ నిలబడగల్గింది. ఈ కంపెనీకి రుణాల చెల్లింపుల ఫ్రీజు బదులు రుణాలలో కొంత మేరకు రద్దు చేస్తారని ముందుగా ఆశించారు.
అయితే ఇందుకు భిన్నంగా ప్రభుత్వం ఆడిట్ నివేదికలను అంచనా వేసుకుని, పరిస్థితులను విశ్లేషించుకుని ఇప్పుడు కేవలం ఫ్రీజ్ నిర్ణయం తీసుకుందని అధికార వర్గాలు తెలిపాయి. ఇక విఐఎల్లో ప్రభుత్వ వాటా 49 శాతం వరకూ ఉంది. నష్టాల ఊబిలో ఉన్న సంస్థకు వెసులుబాటు కల్పించడం ద్వారా ప్రభుత్వం తన ప్రయోజనాలను కూడా కాపాడుకుందని భావిస్తున్నారు. ఎంత ఇబ్బంది ఉన్నా దేశవ్యాప్తంగా ఇతరత్రా వోడా ఐడియా నెట్ వర్క్కు 20 కోట్ల మంది వరకూ వినియోగదారులు ఉన్నారు. వీరి ప్రయోజనాల పరిరక్షణ, ఇదే సమయంలో కంపెనీ ఇతర కంపెనీల పోటీని తట్టుకునేలా చేసేందుకు అవకాశం కల్పించాలని ఈ ఫ్రీజ్ నిర్ణయం తీసుకుందని వెల్లడైంది.
ఆరు లేన్ల నాసిక్ షోలాపూర్ కారిడార్కు ఆమోదం
బుధవారం నాటి కేంద్ర మంత్రి మండలి సమావేశంలో రాదార్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆరు లైన్లతో నాసిక్ షోలాపూర్ అక్కల్కోట్ కారిడార్ను మహారాష్ట్రలో నిర్మించేందుకు ఆమోదం తెలిపారు. మొత్తం రూ 19,142 కోట్ల వ్యయ అంచనాలతో ఈ హరిత క్షేత్ర రాదారి నిర్మాణం జరుగుతుంది. 374 కిలోమీటర్ల ఈ కారిడార్ నిర్మాణం బిఒటి టోల్ మోడల్లో సాగుతుందని అధికార వర్గాలు ఆ తరువాత తెలిపాయి. ప్రత్యేకించి మహారాష్ట్రలోని ప్రధాన ప్రాంతీయ నగరాలు, పట్టణాలకు రవాణా సౌలభ్యం మరింత ఇనుమడించేలా ఈ కారిడార్ ఖరారు చేశారు. నాసిక్, అహల్యానగర్, షోలాపూర్ను ఎపిలోని కర్నూలుకు అనుసంధానించేందుకు ఈ కారిడార్ ఉపయోగపడుతుంది.
పిఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ లోని అంశాల మేరకు ఈ కీలక కారిడార్ ఏర్పాటు జరుగుతుంది. పశ్చిమ తీర ప్రాంతం నుంచి తూర్పు కోస్తా ప్రాంతం మరింత అనుసంధానం అయ్యేందుకు ఈ కారిడార్తో వీలేర్పడుతుందని అధికారిక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే చెన్నై పోర్టు నుంచి నాలుగు లేన్ల కారిడార్ నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి. దీనికి అనుబంధంగా ఇకపై నెలకొనే ఈ కొత్త కారిడార్ రవాణా సౌకర్య ప్రక్రియలో ముఖ్యమైన మైలురాయి కానుంది.