బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ తన అభిమాని కుమారునికి నామకరణం చేశారు. కెసిఆర్ చేతుల మీదుగా తమ కుమారుని పేరు పెట్టుకోవాలని ఎదురుచూసిన తెలంగాణ ఉద్యమకారుల దంపతుల ప్రయత్నం, వైకుంఠ ఏకాదశి పవిత్ర దినం నాడు ఫలించింది. పరిగి నియోజకవర్గానికి చెందిన మల్లేపల్లి గ్రామ నివాసి దొడ్ల నర్సింహులు దంపతులు తమ ప్రియతమ నేత కెసిఆర్తో తన కనిష్ట కుమారునికి నామకరణం చేయించుకోవాలని నిర్ణయించుకున్నారు. కాగా…బాబు పుట్టిన తొమ్మిది నెలల నుండి ఎదురుచూస్తున్న వారి ప్రయత్నం, వైకుంఠ ఏకాదశినాడు ఫలించింది. మంగళవారం నాడు నందినగర్ నివాసానికి వెళ్లగా, కుటుంబంతో వచ్చిన దొడ్ల నర్సింహులు అనిత దంపతులను అధినేత కెసిఆర్ ఆప్యాయంగా ఆహ్వానించారు. ఆ ఉద్యమ దంపతుల కోరికను మన్నించి, వేద పండితుని సలహాతో బాబు జన్మ నక్షత్రం ప్రకారం వచ్చిన, ‘సు’ అక్షరాన్ని ఆధారం చేసుకుని సుమన్ అనే పేరు పెట్టారు. చిన్నారి బాబును ప్రేమతో తలపై నిమిరి, సంపూర్ణ ఆరోగ్యంతో నూరేల్లు వర్ధిల్లాలని కోరుకుంటూ ఆశీర్వదించారు.
అభిమానులతో కిక్కిరిసిన నంది నగర్
తమ ప్రియతమ నేత, బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ను కలిసేందుకు మంగళవారం నందినగర్ నివాసానికి అభిమానులు, పార్టీ నేతలు,కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చారు. దాంతో నందినగర్ నివాసం సందడిగా మారింది. గత రెండు రోజులుగా తనను కలిసేందుకు వచ్చిన అభిమానులు తనతో ఫొటోలు దిగేందుకు కెసిఆర్ అవకాశం కల్పించారు. ఒక్కసారైనా కెసిఆర్తో ఫోటో దిగాలనే తమ కోరిక నెరవేరడంతో పార్టీ శ్రేణులు, అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు.