హైదరాబాద్ నగరాన్ని మరోసారి డ్రగ్స్ మాఫియా ఉలిక్కిపడేలా చేసింది. ముఖ్యంగా సినీ పరిశ్రమకు సంబంధించిన వ్యక్తుల పేర్లు వరుసగా బయటపడుతుండటంతో సంచలనంగా మారింది. మాసబ్ట్యాంక్ పోలీసులు, రాష్ట్ర ‘ఈగల్ టీం సంయుక్తంగా చేపట్టిన ప్రత్యేక దాడుల్లో భారీగా డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. ట్రూప్ బజార్ ప్రాంతానికి చెందిన వ్యాపారవేత్తలు నితిన్ సింఘానియా, శ్రనిక్ సింఘ్వీని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ప్రముఖ నటి రకుల్ప్రీంత్సింగ్ సోదరుడు అమన్ ప్రీత్సింగ్ పరారీలో ఉన్నట్లు సమాచారం. అతడి కోసం ఈగల్ టీమ్, పోలీసులు గాలిస్తున్నారు. ఈ కేసులో ఈ నెల 19న ట్రూప్ బజార్కు చెందిన నితిన్ సింఘానియా, శ్రనిక్ సింఘ్విని పోలీసులు అరెస్టు చేశారు. వారిని విచారించగా అమన్ ప్రీత్సింగ్ పేరు బయటకు వచ్చింది.
ఈ ఇద్దరు వ్యాపారుల నుంచి అతడు డ్రగ్స్ కొన్నట్లు ఈగల్ టీమ్ గుర్తించింది. ఇద్దరు వ్యాపారుల నుంచి 43 గ్రాముల కొకైన్, ఎండీఎంఏ స్వాధీనం చేసుకుంది. గత సంవత్సరం కూడా అమన్ ప్రీత్సింగ్ సైబరాబాద్ పోలీసులకు పట్టుబడ్డాడు. విచారణలో ఈ ఇద్దరు వ్యాపారులు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారనే విషయంతో పాటు, వారికి నలుగురు రెగ్యులర్ కస్టమర్లు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఆ జాబితాలో టాలీవుడ్, బాలీవుడ్లో గుర్తింపు ఉన్న స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ప్రీత్ సింగ్ ఉన్నట్లు తేలింది. అతను తరచూ వీరి దగ్గర డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. డ్రగ్స్పై ఉక్కుపాదం మోపుతామని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం స్పష్టం చేసిన నేపథ్యంలో, ఈ కేసులో త్వరలో కీలక అరెస్టులు జరిగే అవకాశముందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
మాసబ్ ట్యాంక్ పరిధిలో డ్రగ్స్ విక్రయిస్తూ పట్టబడిన కేసులో దర్యాప్తు కొనసాగుతుందని అమన్ ప్రీత్సింగ్ వినియోగదారుడిగా ఉన్నట్లు వెస్ట్జోన్ డిసిపి శ్రీనివాస్ వెల్లడించారు. ఈగల్ టీంతో కలిసి మాసబ్ ట్యాంక్ పోలీస్ స్టేషన్ల నుంచి రెండు బృందాలు పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రధాన నిందితులను ఇప్పటికే అరెస్టు చేశామని, వారికి ముంబాయి నుంచి డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దరు ఆఫ్రికన్ మహిళలను సైతం అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. వినియోగదారుల్లో అమన్ ప్రీత్ సింగ్ ఉన్నాడని, ఆయనతో పాటు మరో ముగ్గురు ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని తెలిపారు.