ఇల్లు నిర్మాణంలో భాగంగా పిల్లర్లకు నీళ్లు కొడుతుండగా విద్యుత్ షాక్కు గురై తండ్రి, కొడుకు మృతి చెందిన ఘటన గురువారం చివ్వెంల మండల కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని 7జీ కాలనీలో నివాసం ఉంటున్న మాదాసు బుచ్చయ్య (48) ఇంటి నిర్మాణానికి బుధవారం మట్టి తొలగింపు పనులు చేపట్టారు. గురువారం సాయంత్రం పిల్లర్లకు నీళ్లు కొట్టేందుకు ట్రాక్టర్ ట్యాంకర్లోని మోటార్ వేసి, నీళ్లు కొడుతుండగా అకస్మాత్తుగా నీటితో పాటు విద్యుత్ సరఫరా అయ్యి బుచ్చయ్య విద్యుత్ షాక్కు గురై కుప్పకూలాడు. కొద్ది నిమిషాల సమయంలోనే అక్కడికి వచ్చిన చిన్న కుమారుడు మాదాసు లోకేష్ (22) ఈ విషయాన్ని గమనించకుండా ట్యాంకర్ను తాకడంతో అతడూ విద్యుత్ షాక్కు గురై కుప్పకూలిపోయాడు. స్థానికులు వెంటనే స్పందించి తండ్రి, కొడుకులను సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరిశీలించి అప్పటికే ఇద్దరూ మృతి చెందినట్లు నిర్ధారించారు. ఒకే కుటుంబానికి చెందిన తండ్రి, కొడుకు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఘటనతో కుటుంబంలో, గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.