న్యూఢిల్లీ : ఢిల్లీ మెట్రో ఫేజ్ 5 (ఏ) విస్తరణకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. ఇందుకోసం రూ.12,015 కోట్లు కేటాయించారు. 13 కొత్త స్టేషన్లను కలుపుతూ 16 కిమీ మేర 3 నూతన కారిడార్లను నిర్మించేలా విస్తరణ పనులు చేపడతారు. దీంతో రాబోయే మూడేళ్లలో ఈ ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్ 400 కిలోమీటర్ల మార్క్ను చేరనుంది.
ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన ఈ కేబినెట్ సమావేశం వివరాలను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు తెలిపారు. ఢిల్లీ మెట్రో చరిత్రలో ఇదొక మైలు రాయిగా అభివర్ణించారు. ఈ ప్రాజెక్టులో 33,000 టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించవచ్చని, రాబోయే మూడేళ్లలో ఈ ప్రాజెక్టు పూర్తవుతుందని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఢిల్లీ మెట్రో ఆపరేషనల్ లెంగ్త్ 400 కిలోమీటర్లను అధిగమిస్తుందని వివరించారు.