హైదరాబాద్: తెలంగాణలో విద్యారంగంపై కొనసాగుతున్న నేరపూరిత నిర్లక్ష్యానికి అద్దంపట్టే చిత్రం ఇది అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ తెలిపారు. మహబూబ్నగర్ జిల్లా మూసాపేట మండలం వేములలో పూర్వప్రాథమిక పాఠశాలలో కొనసాగుతున్న అంగన్వాడీలో పందులు తిరుగాడుతుంటే, బిక్కుబిక్కుమంటూ భోజనం కోసం విద్యార్థులు వరసలో నిలబడ్డారు. దీనికి సంబంధించిన ఫొటోను కెటిఆర్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు. 12 మంది పిల్లలు. 5 పందులు అనే క్యాప్షన్ పెట్టారు. కాంగ్రెస్ గద్దెనెక్కాక రెండేళ్లలో తెలంగాణ ప్రభుత్వ విద్యాసంస్థల్లో 102 ఫుడ్ పాయిజనింగ్ సంఘటనలు జరిగాయని, 2188 పిల్లలు అసుపత్రుల పాలయ్యారని విమర్శించారు. వివిధ కారణాల వల్ల 118 మంది ముక్కుపచ్చలారని పిల్లలు చనిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నా రాష్ట్ర కాంగ్రెస్ సర్కారు మాత్రం మొద్దు నిద్ర వీడటం లేదని కెటిఆర్ చురకలంటించారు.