ఒకే గొడుగు కిందకు రెవెన్యూ, రిజిస్ట్రేషన్, సర్వే విభాగాలు
భూభారతి పోర్టల్తో అనుసంధానం
ఒక్క క్లిక్తో రైతులకు పూర్తి భూసమాచారం
ప్రతి సర్వే నెంబర్కు మ్యాప్ రూపకల్పన
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
సి.సి.ఎల్.ఎ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి
మనతెలంగాణ/హైదరాబాద్ : భూ పరిపాలన వ్యవస్ధను మరింత పారదర్శకంగా,వేగవంతంగా అందించడానికి రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, సర్వే విభాగాలను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి భూభారతి పోర్టల్తో అనుసంధానం చేస్తున్నామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. వచ్చే జనవరి నెలలో ఆధునీకరించిన ఈ వ్యవస్ధను ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నాంపల్లిలోని సి.సి.ఎల్.ఎ కార్యాలయాన్ని సోమవారం నాడు ఆకస్మికంగా తనిఖీ చేశారు.
అనంతరం వివిధ విభాగాలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, భూ పరిపాలనకు కేంద్రమైన సిసిఎల్ఎ కార్యాలయం నిర్వహణ సరిగ్గా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్పొరేట్కు ధీటుగా కార్యాలయాన్ని ఆధునీకరించాలని అధికారులను ఆదేశించారు. వచ్చే నెలలో మరోసారి కార్యాలయాన్ని తనిఖీ చేస్తానని, అప్పటివరకు కొంతమార్పు కనిపించాలని అన్నారు. వరుసగా విభాగాల వారీగా సమీక్షించనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి అధికారుల పూర్తి సమాచారంతో సిద్దంగా ఉండాలని పేర్కొన్నారు.
ఒకే మోడల్లో కొత్త తహశీల్దార్ కార్యాలయాలు
దశాబ్దాల క్రితం ప్రభుత్వం వివిధ అవసరాల కోసం ప్రైవేటు వ్యక్తుల నుంచి భూ సేకరణ జరిపిందని మంత్రి తెలిపారు. ఇప్పటికీ కొన్ని భూములు ప్రైవేటు వ్యక్తుల పేరు మీదే ఉన్నాయని, ఇవన్నీ కూడా రికార్డులలో మార్చాలని చెప్పారు. అలాగే అసైన్డ్, భూధాన్ భూములపై సమీక్షతో పాటు కొన్ని సంవత్సరాల నుంచి ఉద్యోగులపై విజిలెన్స్ కేసులు పెండింగ్లో ఉన్నాయని పేర్కొన్నారు. ఏ విభాగంలో ఎన్ని కేసులు పెండింగ్లో ఉన్నాయి, ఎందుకు పెండింగ్లో ఉన్నాయి..కోర్టు కేసులన్నింటిపై పూర్తిస్ధాయి సమీక్ష నిర్వహిస్తానని అన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా నిర్మించబోయే తహశీల్దార్ కార్యాలయాలు ఒకే మోడల్గా ఉండాలని, ఇందుకు సంబంధించిన డిజైన్ రూపొందించాలని మంత్రి అధికారులకు సూచించారు. ఒక్క క్లిక్తో రైతుకు సంబంధించిన భూముల పూర్తి సమాచారం లభించేలా, అదేవిధంగా రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, మార్కెట్ విలువ, విలేజ్ మ్యాప్, ప్రతి సర్వే నెంబర్కు మ్యాప్, నాలా ఆర్డర్లు, ఆర్ఒఆర్, గ్రామాల నక్షా, ఫీడ్ బ్యాక్ వంటి పూర్తి సమాచారం లభించేలా సర్వే, రిజిస్ట్రేషన్ విభాగాలతో అనుసంధానం చేస్తూ భూభారతి పోర్టల్ను పూర్తి స్ధాయిలో ప్రజలకు చేరువ చేయబోతున్నామని తెలిపారు. ఆధార్ నెంబర్తో అనుసంధానమైన మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయిన వెంటనే కావాల్సిన సమాచారం లభిస్తుందన్నారు.
క్రయ విక్రయదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి సర్వే నెంబర్కు మ్యాప్ను రూపొందించే ప్రక్రియను త్వరలో ప్రారంభిస్తామని వెల్లడించారు. రెవెన్యూ వ్యవస్ధ ఆధునీకరణ చేసే ప్రతిపనిలో సామాన్యుని కోణం ఉండాలని, ఎలాంటి లోపాలకు, తారుమారుకు ఆస్కారం లేకుండా సాఫ్ట్వేర్ను అభివృద్ది చేయాలని సూచించారు. ఈ సమావేశంలో రెవెన్యూ కార్యదర్శి డి.ఎస్. లోకేష్ కుమార్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐ.జీ. రాజీవ్ గాంధీ హనుమంతు, సిసిఎల్ఎ ఇంఛార్జ్ కార్యదర్శి మంద మకరంద్, ఎన్.ఐ.సి. ఎస్.ఐ.ఓ ప్రసాద్, విజయ్మోహన్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.