ఢాకా: బంగ్లాదేశ్ మళ్లీ అట్టుడుకుతోంది. మాజీ ప్రధాని షే క్ హసీనా ప్రభుత్వాన్ని గద్దె దించడంలో కీలక భూమిక పోషించిన విద్యార్థి ఉద్యమ నాయకుడు షరీఫ్ ఉస్మాన్ బి న్ హదీ హత్యోదంతం దేశంలోని పలు ప్రాంతాలలో ఉద్రిక్తతకు దారి తీసింది. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వా త మొదలైన నిరసనలు, హింసాకాండ శుక్రవారం కూడా కొనసాగాయి. అవామీలీగ్, భారత్ వ్యతిరేక నినాదాలతో రహదారులపై నిరసనకారులు ఆందోళనలకు దిగారు. యూనివర్శిటీ విద్యార్థులు, ఇంక్విలాబ్ మంచ్ మద్దతుదారులు బంగ్లాదేశ్ వ్యవస్థాపక నాయకుడు షేక్ ముజిబుర్ రెహమాన్ నివాసం వద్ద ఇప్పటికే కూల్చివేసిన నిర్మాణాన్ని ధ్వంసం చేశారు. ఛాటోగ్రామ్ ప్రాంతంలోని అసిస్టెంట్ ఇండియన్ హై కమిషనర్ నివాసంపై కొందరు రాళ్లు రువ్వారు. ఢాకాలో హింసా కాండకు పాల్పడుతున్న నిరసన కారులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్, ప్రయోగించారు.
లాఠీ చార్జి చేశారు. 12 మంది నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలలో పలువురు గాయపడినట్లు తెలిసింది. బంగ్లాదేశ్ ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహమమద్ యూనస్ టెలివిజన్ లో ప్రసంగిస్తూ, ఇంక్విలాబ్ మంచా లీడర్ హాది మరణాన్ని ధృవీకరించిన తర్వాత అల్లర్లు చోటు చేసుకున్నాయి. హాదీ పై డిసెంబర్ 12న అనూహ్యంగా ఢాకాలో దుండగులు కాల్పులు జరిపారు. మెరుగైన చికిత్సకోసం సింగపూర్ తరలించగా అక్కడ గురువారంనాడు ఆయన మరణించారు. దీంతో గురువారం రాత్రినుంచే ఆయన మద్దతు దారులు అల్లర్లకు తెగపడ్డారు. గురువారం అర్థరాత్రి సమయంలో నిరసనకారులు బెంగాలీ భాషా దినపత్రిక, ఆంగ్ర పత్రిక భవనాలకు నిప్పంటించారు. మొదట ప్రోథోమ్ అలో కార్యాలయాన్ని ధ్వంసం చేసి ఆ తర్వాత దినపత్రికల కార్యాలయాలకు నిప్పు పెట్టారు.రాజ్ షాహి నగరంలో అవామీలీగ్ పార్టీ కార్యాలయాన్ని కూడా ధ్వంసంచేశారు.
హిందూ యువకుడి దారుణహత్య..
ఇదే నేపథ్యంలో భారత వ్యతిరేకులైన అల్లరి మూక దాడిలో భలుకా సబ్ డిస్ట్రిక్ట్ లో దీపు చంద్ర దాస్ అనే హిందు యువకుడు చనిపోయాడు. ఇస్లాంను అవమానించారని ఆరోపణపై ఈ దాడి జరిగింది. విచక్షణ కోల్పోయిన నిరసనకారులు అతడి మృతదేహాన్ని తగులపెట్టారని బంగ్లాదేశ్ మీడియా వెల్లడించింది. హాదీ మరణానంతరం హింసాత్మక నిరసనలు చెలరేగుతున్న సమయంలోనే ఈ సంఘటన జరిగింది. హిందూ వ్యక్తి హత్యను కూడా ముహమ్మద్ యూనస్ ఆధ్వర్యంలోని బంగ్లా ప్రభుత్వం ఖండించింది. కొత్త బంగ్లాదేశ్ లో అలాంటి హింసకు చోటులేదని పేర్కొంది. ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తులను వదిలి పెట్టబోమని ప్రకటించింది. నిరసనకారులు సంయమనం పాటించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఇదిలావుండగా మోమిన్ సింగ్ అనే మరో యువకుడిని కూడా ఆందోళనకారులు హతమార్చినట్లు తెలిసింది.
12న ఢాకాలో కాల్పులు.. సింగపూర్లో మృతి
కాగా, వచ్చే ఫిబ్రవరి నెలలో బంగ్లాదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈ అల్లర్లు చోటు చేసుకోవడం విశేషం, రానున్న ఎన్నికలలో ఇండిపెండెంట్ అభ్యర్ధిగా హదీ పోటీ చేస్తున్నారు. ఆయనకు చెందిన ఇంక్విలాబ్ మంచ్ రాజకీయ సంస్థ ఎన్నికల్లో పోటీ చేయడంపై యూనస్ ప్రభుత్వం నిషేధం విధించిన నేపథ్యంలో ఒంటరిగా బరిలోకి దిగాలని హదీ నిర్ణయించుకున్నారు. డిసెంబర్ 12న సెంట్రల్ ఢాకాలోని బిజోయ్నగర్ ప్రాంతంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తుండగా ముసుగు ధరించిన కొందరు దుండగులు ఆయన పై కాల్పులు జరిపారు. సింగపూర్లో ఆరు రోజుల మృత్యువుతో పోరాడి హాదీ చనిపోయారు. గురువారం రాత్రి ఢాకా యూనివర్సిటీలో విద్యార్థులు, నేషనల్ సిటిజన్స్ పార్టీ ఆధ్వర్యంలో సంతాప సభ అనంతరం ఊరేగింపు జరిగింది. హాది పై దాడి చేసి హత్యచేసిన దుండగులు తర్వాత భారతదేశానికి పారిపోయారని ఆరోపిస్తూ వారు భారత వ్యతిరేక నినాదాలు చేశారు. హంతకులు తిరిగి వచ్చే వరకూ భారత హై కమిషన్ ను మూసివేయాలని వారు బంగ్లా తాత్కాలిక ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పరిస్థితి అల్లకల్లోలం: పార్లమెంట్ ప్యానెల్
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్లో ప్రస్తుత పరిస్థితి అత్యంత సంక్లిష్టం, అల్లకల్లోలంగా ఉందని విదేశీ వ్యవహారాల పార్లమెంటరీ కమిటీ వెల్లడించింది. “ భవిష్యత్లో భారత్బంగ్లాదేశ్ సంబంధాలు” అన్న శీర్షికన కమిటీ సమర్పించిన నివేదికలో ఉభయదేశాల విస్తృత ద్వైపాక్షిక సంబంధాలపై ఇటీవల రాజకీయ పరిణామాల ప్రభావాన్ని వివరించింది. ఈ ప్రభావం నుంచి ద్వైపాక్షిక సంబంధాలను పరిరక్షించడమవుతుందని కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ వెల్లడించింది. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ నేతృత్వం వహిస్తున్న ఈ పార్లమెంటరీ కమిటీ గురువారం ఈ నివేదికను పార్లమెంట్కు సమర్పించింది. ప్రజాస్వామ్య ఎన్నికల షెడ్యూల్ విషయంలో అనిశ్చితి నెలకొందని, 2024 ఆగస్టులో సంభవించిన రాజకీయ పరిణామాలతో మైనారిటీలు, గిరిజనసమాజాలు, మీడియా వర్గాలు, మేథావులు, జర్నలిస్టులపై హింస , దాడులు చెలరేగి అనిశ్చితి, అస్థిరత ఏర్పడిందని కమిటీ తన నివేదకలో పేర్కొంది. ఈ పరిస్థితి ద్రవ్యోల్బణం , ఆర్థిక మందగమనానికి దారి తీసిందని వివరించింది.