ఆంధ్రప్రదేశ్లోని పసిబిడ్డల విక్రయాలకు పాల్పడుతున్న ఓ ముఠా గుట్టును విజయవాడ పోలీసులు రట్టు చేశారు ఢిల్లీ, యూపితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి నెలల వయసున్న శిశువులను తెప్పించి అక్రమంగా విక్రయిస్తున్న ముఠాను అరెస్టు చేసి, ఐదుగురు పసిబిడ్డలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒక్కో శిశువును రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు విక్రయిస్తున్నట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. గతంలో అరెస్ట్ అయిన బండి సరోజ ముఠానే ఈ అక్రమ శిశు విక్రయాలకు పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. మూడు నెలల క్రితం అరెస్ట్ అయిన అనంతరం బయటకు వచ్చిన సరోజ ముఠా మళ్లీ ఈ దందాను కొనసాగి స్తున్నట్టు పోలీసులు నిర్ధారించారు.
కేసులో మొత్తం 13 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఆరుగురు మహిళలు, ఏడుగురు పురుషులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులు విజయవాడ, పాయకాపురం, గుంటూరు, నరసరావుపేట ప్రాంతాలకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. ముఠా నుంచి స్వాధీనం చేసుకున్న ఐదుగురు పసిబిడ్డలను ఐసిడిఎస్ అధికారులకు పోలీసులు అప్పగించారు. పిల్లలకు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి, రక్షణ చర్యలు చేపట్టినట్టు వెల్లడించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు అక్రమ శిశు విక్రయాల వెనుక ఉన్న పెద్ద నెట్వర్క్ ఛేదించే దిశగా చర్యలకు ఉపక్రమించారు.