విలక్షణ నటుడు శివాజీ ప్రధాన పాత్రను పోషించిన చిత్రం ‘దండోరా’. ‘కలర్ ఫొటో’, ‘బెదురులంక 2012’ వంటి మంచి చిత్రాలను నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించిన లౌక్య ఎంటర్టైన్మెంట్స్ అధినేత రవీంద్ర బెనర్జీ ముప్పానేని ఈ మూవీని రూపొందించారు. ఈ చిత్రంలో నవదీప్, నందు, రవికృష్ణ, మనీకా చిక్కాల, మౌనికా రెడ్డి, బిందు మాధవి, రాధ్య. అదితి భావరాజు ముఖ్య పాత్రల్ని పోషించారు. ఈ చిత్రానికి మురళీకాంత్ దర్శకత్వం వహించారు. ఈ మూవీని డిసెంబర్ 25న భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో నటుడు శివాజీ మీడియాతో మాట్లాడుతూ “దండోరా చిత్రంలో నా పాత్ర విభిన్నంగా ఉంటుంది. మంచోడా? చెడ్డోడా? అని చూసే ప్రేక్షకుడికి సరిగ్గా అర్థం కాదు. సినిమా చూసిన తరువాత ఆడియెన్స్ నా పాత్ర గురించి చెప్పాల్సి ఉంటుంది. ఈ చిత్రంలో నేను వ్యవసాయదారుడిగా కనిపిస్తాను.
అయితే ఈ చిత్రంలోని అన్ని కారెక్టర్స్ నా చుట్టూనే తిరుగుతాయి. అంత ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్ర నాది. ఇలాంటి చిత్రాలు, కథలు, పాత్రలు చాలా అరుదుగా వస్తుంటాయి. ఏదో అలా వచ్చి వెళ్లినట్టుగా ఏ పాత్ర కూడా ఉండదు. అన్ని పాత్రలకు ప్రాధాన్యత ఉంటుంది. ‘దండోరా’ పూర్తిగా సందేశాత్మక చిత్రం కాదు. అన్ని రకాల కమర్షియల్ అంశాలను జోడించి తెరకెక్కించిన చిత్రమిది. అన్ని రకాల భావావేశాలున్న సినిమా ఇది. ఇందులో గొప్ప స్క్రీన్ ప్లే ఉంటుంది. ఎంతో సహజంగా ఉండే చిత్రమిది. ‘దండోరా’ తరువాత నా నుంచి ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ అనే చిత్రం రాబోతోంది. ఆదిత్య హాసన్ దర్శకత్వంలో రానున్న ‘ఎపిక్’ అద్భుతంగా ఉండబోతోంది. ప్రతీ ఫ్యామిలీ, తండ్రీకొడుకులకు కనెక్ట్ అయ్యే ఎన్నో అద్భుతమైన సన్నివేశాలతో ‘ఎపిక్’ ఉంటుంది”అని అన్నారు.