హైదరాబాద్: మూడో దశ సర్పంచ్ ఎన్నికలు జరిగే గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రతి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలను చేస్తుందని ప్రశంసించారు. ఈ రోజు అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు గ్రామ స్థాయి వరకు చేరుకున్నాయని పేర్కొన్నారు. తన సోషల్ మీడియా ఖాతాలో పొన్నం పోస్టు చేశారు. సన్న బియ్యం, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు, ఆర్టీసీ లో ఉచిత ప్రయాణం ఇలా ఎన్నో పథకాలు అమలవుతున్నాయని పొన్నం ప్రభాకర్ తెలియజేశారు. ఇంకా భవిష్యత్ లో అనేక కార్యక్రమాలను కొనసాగిస్తామని, మూడో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థులను గెలిపించాలని కోరుతున్నామన్నారు.