సాల్ట్లేక్ స్టేడియంలో 10నిమిషాలే గడిపిన ఫుట్బాల్ దిగ్గజం
మైదానంలో విధ్వంసానికి దిగిన అభిమానులు
నేతలు, వివిఐపిల హడావుడి, సెల్ఫీల మోజులో చేజారిన పరిస్థితి
మెస్సితో పాటు అభిమానులకు సిఎం మమత క్షమాపణలు
విచారణకు ఆదేశం, నిర్వాహకుడి అరెస్ట్
కోల్కతా : ఫుట్బాల్ ప్రపంచ దిగ్గజ ఆటగాడు లియోనల్ మెస్సి కోల్కతా పర్యటన తీవ్ర గందరగోళానికి దారితీసింది. స్థానిక ప్రఖ్యాత సాల్ట్లేక్ స్టేడియంలో శనివారం నాటి చిరకాల ఎగ్జిబిషన్ మ్యాచ్ రభసకు దారితీసింది. 50 వేల మందికి పైగా తరలివచ్చిన మెస్సి అభిమానులు, ఫుట్బాల్ వీరాభిమానుల సందడితో మహానగరం హోరెత్తింది. స్థానిక వివేకానంద యువభారతి సాల్ట్లేక్ స్టేడియంలో కిక్కిరిసిన జనం కేకలు అరుపులు , దాదాపుగా అరాచక పరిస్థితితో విసిగెత్తిన మెస్సి కేవలం ఈ మ్యాచ్లో కొద్ది నిమిషాల పాటు ఆడినట్లుగా చేసి భద్రతావలయంతో కనీసం ఫ్యాన్స్ వైపు చూడకుండానే వెళ్లిపోయారు. మెస్సీ.. మెస్సీ.. అని ఒకవైపు నినదిస్తుండగానే ఆయన వెళ్లిపోయినట్లు గుర్తించిన అభిమానులు ఆగ్రహోదగ్రులయ్యారు. స్టేడియంలో విధ్వంసానికి దిగారు. కుర్చీలను , బారికేడ్లను విరగొట్టారు. మైదానంలోకి బాటిళ్లు విసిరివేశారు. వేలాది బెంగాలీ ఫుట్బాల్ అభిమానులకు చేదు అనుభవంగా మారింది. భారతీయ ఫుట్బాల్, స్థానిక ఫుట్బాల్ సంఘం ప్రత్యేకించి రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాంగం వైఫల్యం , నిర్వహణా ఏర్పాట్ల లోపాలతో మెస్సి పర్యటన ప్రహసనంగా మారింది. సరైన పోలీసు భద్రత లేకపోవడం, మ్యాచ్కు ప్రాధాన్యత ఇవ్వకపోవడం వంటి పలు కారణాలు బయటపడ్డాయి.
నేతలు, వివిపిఐపిల సెల్ఫీలతో చేజారిన పరిస్థితి
మ్యాచ్కు ముందు అక్కడ రాజకీయ నాయకులు వివిఐపిలు పెద్ద ఎత్తున భద్రతా సిబ్బంది, నిర్వాహకులు చేరుకోవడం, ప్రేక్షకులను పట్టించుకోకుండా వారిని కంట్రోల్ చేయకుండా వేదికపై, స్టేడియంలో సెల్ఫీలకు దిగుతూ ఉండటంతో పరిస్థితి దిగజారింది. దీనితోనే మెస్సీ తీవ్ర ఆగ్రహంతో అక్కడి నుంచి వెళ్లారు. మెస్సీ అర్థరాత్రి కోల్కతా రాక దశలో విమానాశ్రయంలో తరువాత తెల్లవారుజామున మ్యాచ్కు ముందు స్టేడియం వద్దకు ఆయనను చూసేందుకు జనం తరలివచ్చారు. స్టేడియంలో అర లక్ష మంది వరకూ మెస్సీ మెస్సీ అంటూ నినాదాలకు దిగారు. ఇక్కడి మెహన్ బగన్, డైమండ్ హార్బర్ ఇసికి చెందిన మాజీ ఫుట్బాల్ క్రీడాకారులు నెంబరు 10 జెర్సీలతో 35 నిమిషాల ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడారు. ఇందులో మెస్సి ఉన్నది కేవలం 20 నిమిషాలే . అయితే మెస్సీ వెళ్లిపోవడంతో ఫ్యాన్స్ ఇతరుల అరాచకం విచ్చలవిడిగా సాగింది. ఛెయిర్స్, ట్రాఫీలు , సిఎం ఎన్క్లోజర్లోని ఫర్నిచర్ అంతా ధ్వంసం అయింది.
నెల రోజుల జీతంతో ఇంతటి వెతలకా
నెలరోజుల జీతం పెట్టి, చివరికి ఇక్కడి రూ 200కు కూల్ డ్రింక్, మంచినీరు బాటిల్ తీసుకుంటే మెస్సీని చూడలేకపోయాం. ఇంతకూ రాజకీయ నాయకులు సెల్ఫీలు దిగేందుకు ఇక్కడి కార్యక్రమం ఏర్పాటు అయిందా? అని పలువురు ఫ్యాన్స్ నిలదీశారు. ప్రేక్షకులు ప్రశాంతంగా ఉండాలని కార్యక్రమ ప్రమోటర్ సతద్రు దత్తా గద్గద కంఠంతో వేడుకున్నా ఫలితం లేకుండా పోయింది.ఈ లోగానే మెస్సీ కోల్కతా పర్యటన ముగించుకుని హడావిడిగా హైదరాబాద్ చేరుకునేందుకు విమానాశ్రయానికి వెళ్లారు.
వెనుదిరిగివెళ్లిన షారూక్, మమత బెనర్జీ
స్టేడియంలో గందరగోళంతో అప్పటివరకూ వివేకానంద విగ్రహం వద్ద వేచి ఉన్న సూపర్స్టార్ షారూక్ ఖాన్ అక్కడి నుంచి జారుకున్నారు. ఈ లోగా క్రికెటర్ సౌరవ్ గంగూలీ అక్కడికి వచ్చారని వదంతులు విన్పించాయి. దీనితో జనం మరింతగా చెలరేగిపోయారు. కాగా వేదిక వద్దకు అప్పుడే బయలుదేరిన సిఎం మమత బెనర్జీ పరిస్థితి గురించి తెలియగానే మధ్యలోనే వెనకకు వెళ్లారు.
నిర్వాహకులు శతాద్రు దత్తా అరెస్టు
కార్యక్రమ నిర్వహణలో లోపాల కారణంగా కోల్కతా పోలీసులు శతాద్రు దత్తాను అరెస్టు చేశారు. స్టేడియంలో అశాంతికి కారణమని సుమోటోగా ఆయను బిధానగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని వెల్లడైంది. మెస్సీని హైదరాబాద్కు సాగనంపేందుకు విమానాశ్రయానికి వచ్చిన దశలోనే వెలుపల పోలీసులు ఆయనను అరెస్టు చేసి తీసుకువెళ్లారు.
మెస్సీకి మమత క్షమాపణ, దర్యాప్తునకు ఆదేశాలు
కోల్కతాలో మ్యాచ్ గందరగోళ పరిస్థితి పట్ల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ విచారం వ్యక్తం చేశారు. కలిగిన అసౌకర్యానికి మెస్సీకి క్షమాపణలు తెలిపారు. అసలు ఏం జరిగింది? నిర్వహణ లోపాలకు కారణం ఏమిటీ; ఎవరు బాధ్యుతలు తేల్చుకునేందుకు ఉతన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. మెస్సీకి, వేలాది మంది క్రీడాభిమానులకు, మెస్సీ ఫాన్స్కు తన ప్రగాఢ విచారం తెలియచేస్తున్నట్లు తెలిపారు.
నాలుగు నగరాల మెస్సి పర్యటన ఆరంభం
అర్జెంటీనా ఫుట్బాల్ సూపర్స్టార్ మెస్సికి కోల్కతా పర్యటన ఇది రెండోసారి. భారత్లో పర్యటనకు ‘గోట్’గా పేరు పెట్టారు. ఇందులో భాగంగా నాలుగు నగరాలు హైదరాబాద్, ముంబై, న్యూఢిల్లీ ల్లో ఆయన ఫుట్బాల్ మ్యాచ్లు ఉన్నాయి. వరుసక్రమం కోల్కతాతో ఆరంభం అయింది. భారతీయ ఫుట్బాల్ ప్రమాణాలు పడిపోతూ ఇప్పుడు తాజా ఫిఫా ర్యాంకింగ్లో 142వ స్థాయికి దిగజారింది.ఈ దశలో భారతీయ ఫుట్బాల్ అసోసియేషన్ మెస్సీ టూర్ను ముందస్తు భారీ ప్రణాళికతోనే ఖరారు చేసింది. ఓ వైపు రూ 4 వేల నుంచి రూ 12వేల వరకూ చివరికి కొందరు ఏకంగా రూ 20వేల వరకూ బ్లాక్మార్కెట్లో టికెట్లు కొనుక్కుని అతి కష్టం మీద స్టేడియంకు చేరారు. అయితే వారి ఆనందం మరి వారి అత్యుత్సాహంతోనే గందరగోళం వల్ల నీరుగారింది.