రాష్ట్ర, దేశ రాజకీయాల్లో ఎన్టీఆర్ ముద్ర శాశ్వతమైనది, విశిష్టమైనదని సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఎన్టీఆర్ పేరు నిలిచిపోతుందని పార్లమెంట్ సభ్యురాలు పురందేశ్వరి పేర్కొన్నారు. ఆడియో రూపంలో రూపొందించిన ‘1984 ఆగస్టు పరిరక్షణోద్యమం సజీవ చరిత్ర పుస్తకాన్ని’ శనివారం హైదరాబాద్ ఎఫ్ఎన్సిసిలో నిర్వహించిన కార్యక్రమంలో పురందేశ్వరి ముఖ్య అతిథిగా పాల్గొని ఆవిష్కరించారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి మా తెలుగు తల్లికి గీతాలాపన చేశారు. జయప్రద ఫౌండేషన్ ఆధ్వర్యంలో టీడీ జనార్దన్ చైర్మన్గా ఉన్న ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ రూపొందించిన సజీవ చరిత్ర పుస్తకం ఆడియో రూపం విడుదల చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న పురందేశ్వరి కీలకోపన్యాసం చేస్తూ 1984 ప్రజాస్వామ్య పరిరక్షణోద్యమం ఎన్టీఆర్ జీవితంలోనే ప్రధాన సంఘటన అని, అంతేకాకుండా దేశ రాజకీయాలను పూర్తిగా మార్చివేసిన రాజకీయ సంఘటనగా పేర్కొన్నారు.
ఎన్టీఆర్ భావజాలాన్ని నలుదిక్కుల వ్యాపింపజేస్తున్న ఎన్టీఆర్ కమిటీ లిటరేచర్ సభ్యులకు చైర్మన్ టీడీ జనార్దన్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ రాజకీయ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, నందమూరి రామకృష్ణ, సినీ నిర్మాత కె ఎస్ రామారావు, బొల్లినేని క్రిష్ణయ్య, చైతన్య రాజు, పుస్తక రచయిత విక్రమ్ పూల, ఆడియో పుస్తకానికి గాత్రధారణ చేసిన గాయత్రి, ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ సభ్యులు రామ్మోహన్ రావు, గుమ్మడి గోపాలకృష్ణ, మండవ సతీష్, మధుసూదనరాజు, బిక్కి కృష్ణ, ప్రొఫెసర్ వెంకట్, పర్వతనేని రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ముందుగా రచయిత విక్రమ్ పూల పుస్తక పరిచయం చేశారు. స్వాగతోపన్యాసం చేసిన కమిటీ చైర్మన్ టీడీ జనార్దన్ మాట్లాడుతూ ఎన్టీఆర్ సినీ రాజకీయ రంగాల్లో చేసిన కృషిని, ఆయన నెలకొల్పిన ఉన్నత ప్రమాణాలను ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ అభిమానులు, ఇతర సినీ పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.