సాంకేతికతను, మగ్గాన్ని జోడించి సిరిసిల్లకు చెందిన ప్రముఖ నేతన్న నల్ల విజయ్ కుమార్ రూపొందించిన ‘క్యూఆర్ కోడ్’ శాలువాను బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ నంది నగర్లోని నివాసంలో శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ ప్రతిభను కెటిఆర్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా నేతన్న నల్ల విజయ్ కుమార్ మాట్లాడుతూ, తన నాన్న గతంలో అగ్గిపెట్టెలో పట్టే చీరను తయారు చేశారని, ఆయనే తనకు స్ఫూర్తి అని పేర్కొన్నారు. గతంలో తాను రంగులు మారే చీరను, అగ్గిపెట్టెలో పట్టే చీరను తయారు చేసినప్పుడు, అప్పటి సిఎం కెసిఆర్ చేతుల మీదుగా ఉగాది పురస్కారం అందుకోవడం తన అదృష్టం అని గుర్తు చేసుకున్నారు. కెసిఆర్ తెలంగాణకు చేసిన అభివృద్ధిని,
మన వారసత్వ సంపదను పది మందికి తెలియజేయాలనే ఆలోచనతోనే ఈ క్యూఆర్ కోడ్ శాలువాను రూపొందించినట్లు తెలిపారు. సిరిసిల్ల ఎప్పుడూ కొత్త ఆవిష్కరణలకు అడ్డా అని నిరూపించడమే తన లక్ష్యం అని పేర్కొన్నారు. ఈ అద్భుత ఆవిష్కరణను కెటిఆర్ ద్వారా కెసిఆర్కు అందించాలనే తన కోరిక అని చెప్పారు. అందుకు కెటిఆర్ స్పందిస్తూ తప్పకుండా ఈ శాలువాను కెసిఆర్కు అందజేస్తానని హామీ ఇచ్చారు. నేతన్నలకు కెటిఆర్ ఎల్లప్పుడూ అండగా ఉంటూ ప్రోత్సహిస్తున్నారని, భవిష్యత్తులో మరిన్ని అద్భుతాలు సృష్టిస్తామని విజయ్ సంతోషం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, బిఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ రావుల చంద్రశేఖర్ రెడ్డి, సీనియర్ నాయకులు జాన్సన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
శాలువా ప్రత్యేకతలు
‘పోగు బంధంతో ఫోన్ బంధం‘ అనే కాన్సెప్ట్తో విజయ్ కుమార్ ఈ శాలువాను రూపొందించారు. శాలువాపై నేసిన క్యూఆర్ కోడ్ను మొబైల్ ఫోన్తో స్కాన్ చేయగానే తెలంగాణ చరిత్ర, సంస్కృతి, ప్రముఖ దేవాలయాలు, చారిత్రక కట్టడాలు కనిపిస్తాయి. అంతేకాకుండా, కెసిఆర్ హయాంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టుల గొప్పతనాన్ని, యాదాద్రి ఆలయ వైభవాన్ని తెలిపేలా ఈ కోడ్ను తీర్చిదిద్దారు. కేవలం 15 రోజుల వ్యవధిలో ఇంతటి అద్భుతమైన శాలువాను విజయ్ కుమార్ రూపొందించడం విశేషం.