మన తెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఫుట్బాల్ సరదా కోసం రూ.వంద కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ఇలా ప్రజాధనం దుర్వినియోగం ముమ్మాటికీ ఆర్ధిక నేరమే అవుతుందని అభిప్రాయపడ్డారు. ప్రజాధనంతో ఫుట్బాల్ ఆడుకుంటున్న రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే ప్రజలు నిన్నే ఫుట్బాల్ ఆడుకుంటారని మహేశ్వర్రెడ్డి ఎద్దేవా చేశారు. గురువారం నాడిక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో మెస్సీతో ఫుట్ బాల్ మ్యాచ్ ఆడడానికి ప్రభుత్వం ఎన్ని కోట్లు ఖర్చు చేస్తోందో, ఏ యో శాఖల నుంచి ఖర్చు చేస్తోందో, ఎందుకు ఖర్చు చేస్తోందో సీఎం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
సీఎం రేవంత్ టీమ్ ను సింగరేణి స్పాన్సర్ చేస్తోందని మీడియాలో చూశానని, ఈ ఫుట్ బాల్ ఆట కోసం సింగరేణి డబ్బులను ఎంత ఖర్చు చేస్తున్నారు, ఎందుకు ఖర్చు చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇవే డబ్బులను సింగరేణిలో ఉన్న క్రీడాకారులను ప్రోత్సహించడానికి లేదంటే కార్మికుల సంక్షేమానికి ఖర్చు చేయవచ్చు కదా అని అన్నారు. మెస్సీ టీమ్తో రేవంత్ టీమ్ ఫుట్ బాల్ ఆడడం వల్ల రాష్రానికి వచ్చే ప్రయోజనమేంటో సీఎం చెప్పాలని డిమాండ్ చేశారు. అంతర్జాతీయ ఫుట్బాల్ దిగ్గజం లియోనిల్ మెస్సీ ఒక ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడితే, అప్పీయరెన్స్ ఫీజు కింద రూ.70 కోట్లు తీసుకుంటారని తెలిసిందని, అయితే మెస్సీకి ఇచ్చే అప్పీయరెన్స్ ఫీజు ఏ ప్రభుత్వ శాఖ చెల్లిస్తోందో చెప్పాలని, దాని వల్ల కలిగే ప్రయోజనమేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. సింగరేణి, పర్యాటక, క్రీడల శాఖల నుంచి నిధులను మెస్సీ టూర్కు మళ్లించినట్టు సమాచారం ఉందని, అయితే ఫుట్ బాల్ ఎగ్జిబిషన్ మ్యాచ్తో ఈ మూడు శాఖలకు కలిగే ప్రయోజనమేంటో చెప్పాలని ఆయన కోరారు.