రాజకీయాలను సహించేది లేదు
బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలను ఎదుర్కోలేక, భౌతిక దాడులకు దిగడం కాంగ్రెస్ పార్టీ దిగజారుడుతనానికి నిదర్శనం అని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మండిపడ్డారు. అధికార మదంతో కాంగ్రెస్ గూండాలు సాగిస్తున్న అరాచకాలను బిఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించని హెచ్చరించారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సాగిస్తున్న హత్యా రాజకీయాలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నూతనకల్ మండలం లింగంపల్లి గ్రామంలో బిఆర్ఎస్ శ్రేణులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు.
ఈ దాడిలో బిఆర్ఎస్ కార్యకర్త ఉప్పుల మల్లయ్య ప్రాణాలు కోల్పోవడం పట్ల కెటిఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గత రాత్రి లింగంపల్లి గ్రామంలో సుమారు 70 మంది కాంగ్రెస్ కార్యకర్తలు కర్రలు, రాళ్లతో బిఆర్ఎస్ నాయకులే లక్ష్యంగా విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఉప్పుల మల్లయ్య మృతి చెందగా,బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు మున్నా మల్లయ్య యాదవ్తో పాటు మరో 15 మంది కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి.
ఈ ఘటన తెలిసిన వెంటనే కెటిఆర్ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, స్థానిక మాజీ ఎంఎల్ఎ గాదరి కిషోర్లతో ఫోన్లో మాట్లాడి క్షేత్రస్థాయి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తకు, నాయకుడికి బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎవరూ అధైర్య పడవద్దని, మరణించిన కార్యకర్త కుటుంబానికి, గాయపడిన వారికి పార్టీ అన్ని విధాలా అండగా నిలుస్తుందని తెలిపారు. దాడికి పాల్పడిన వారిపై పోలీసులు వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని, బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని కెటిఆర్ డిమాండ్ చేశారు.