మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్ర మంత్రివర్గం చురుకుగా పనిచేసి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించిందని సిపిఐ సీనియర్ నాయకులు, సిపిఐ కంట్రోల్ కమిషన్ చైర్మన్ డాక్టర్ కె. నారాయణ అన్నారు. గొప్పగా నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన అభినందనలు తెలిపారు. దాదాపు రూ. 6 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు తెలుస్తోందని ఆయన పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాలకు, వ్యవసాయ రంగానికి ప్రాధాన్యతనిస్తూనే పారిశ్రామికాభివృద్ధికి సమన్వయం చేసుకోవాలని నారాయణ సూచించారు. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు పెట్టుబడికి మంచి వాతావరణం కలిగిన భూములు అందుబాటులో ఉంటాయని అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని ఆయనన్నారు. ప్రణాళిక బద్ధంగా పారిశ్రామికాభివృద్ధి చేపడితే రానున్న రోజుల్లో పరిశ్రమలు పెరుగుతాయని తెలిపారు. అనుమతులు ఇచ్చే విషయంలో అవకతవకలు జరగకుండా రెవెన్యూ విభాగం అమలు చేయాలని నారాయణ అన్నారు.