మన తెలంగాణ/కుత్బుల్లాపూర్: హిల్ట్ పాలసీ(హెచ్ఐఎల్టిపి) పేరిట కాంగ్రెస్ ప్రభు త్వం భారీ భూ కుంభకోణానికి తెరలేపిందని.. ఉద్యోగ,ఉపాధి కల్పన కోసం ఇచ్చిన భూములనూ ప్రైవేటు వ్యక్తులకు దోచిపెట్టి రేవంత్రెడ్డి అవినీతి అనకొండగా మారారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రా మారావు విమర్శించారు. బిఆర్ఎస్ చేపట్టిన పోరుబాట కార్యక్రమంలో భాగంగా కుత్బుల్లాపూర్ పరిధిలోని పారిశ్రామిక వాడలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బిఆర్ఎస్ఎల్ఫీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, సత్యవతి రా థోడ్, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్ది, పార్లమెంటరీ ఇంచార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి తదితరులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా తో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్ది తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం హెచ్ఐఎల్టిపి (హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫార్మేషన్ పాలసీ) పేరుతో 5 లక్షల కోట్ల రూపాయల భారీ భూ కుంభకోణానికి పాల్పడుతోంది. ఒకప్పుడు ప్రభుత్వాలు ప్రజలకు, పరిశ్రమల కోసం, ఉద్యోగ ఉపాధి కల్పన కోసం ఇచ్చిన భూములను ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేస్తున్నారనారు. పరిశ్రమలు వద్దంటూ… అపార్ట్మెంట్లు, విల్లాలు, కమర్షియల్ కాంప్లెక్స్లు కట్టుకోమని పారిశ్రామిక భూములను ఇస్తున్నారు. ప్రభుత్వం చెబుతున్నట్లు అవి ప్రైవేట్ వ్యక్తుల భూములు కావు. ప్రైవేట్ వ్యక్తులకు ప్రజల కోసం ప్రభుత్వం ఇచ్చిన భూములు.
కేవలం పరిశ్రమలు పెట్టి ఉపాధి కల్పించాలన్న నిబంధనలతోనే ఆ భూములను ఇవ్వడం జరిగిందనారు. మార్కెట్లో గజం ధర లక్షన్నర రూపాయలు పలుకుతుంటే, ప్రభుత్వం కేవలం 4,000 రూపాయలకే ప్రైవేట్ వ్యక్తులకు అప్పజెప్తోంది. హైదరాబాద్ నగరంలో పేదలకు ఇండ్లకు, పాఠశాలలకు, ఆసుపత్రులకు, చివరికి శ్మశానాలకు కూడా స్థలం లేదు. కానీ, ప్రైవేట్ వ్యక్తులకు 9,300 ఎకరాల భూమిని ప్రభుత్వం అప్పనంగా ఇస్తామంటోందని మండి పడ్డారు. ఈ 9,300 ఎకరాల భూములను తిరిగి వెనక్కి తీసుకొని, అక్కడ కాంగ్రెస్ చెబుతున్న ఇందిరమ్మ ఇండ్లు, యంగ్ ఇండియా స్కూల్స్, ఆసుపత్రులు కట్టాలి. హైదరాబాద్లో స్థలం లేదని చెప్పి ఇప్పటిదాకా ఒక్క ఇందిరమ్మ ఇల్లు కూడా కాంగ్రెస్ కట్టలేదని ఆరోపించారు. ఇక్కడ ఉన్న కంపెనీలు తరలివెళ్తే, హైదరాబాద్ నగరంలో వాటిపైన ఆధారపడిన లక్షల మంది ఉపాధి పోతుంది. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ కుంభకోణాన్ని ప్రజలకు వివరించేందుకే ఈరోజు పారిశ్రామిక వాడల్లో పర్యటిస్తున్నామనారు. ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తున్న భూముల ధర నిర్ధారణ, దాని వెనుక ఉన్న అసలు నిజాలు నిగ్గుతేల్చాలన్న ఉద్దేశంతోనే ఈ పర్యటనలు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఈ అంశాన్ని ఇక్కడితో మా పార్టీ వదిలిపెట్టదు. హెచ్ఐఎల్టి (హిల్ట్) పాలసీ కుంభకోణం పైన త్వరలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తాము. నగరంలో కాలనీలలో ప్రజలకు ఈ అంశాన్ని వివరిస్తాము, రౌండ్ టేండ్ సమావేశాలు నిర్వహిస్తాము. ప్రజా సంఘాలు, ప్రతిపక్ష పార్టీలను కలుపుకొని ముందుకు పోతాము అని కేటీఆర్ అన్నారు.
ఈ పాలసీని వెనక్కి తీసుకొని, లక్షల కోట్ల విలువైవ ప్రజల భూమిని కాపాడే దాకా మా పోరాటం కొనసాగుతుంది. అవసరమైతే న్యాయపోరాటం చేస్తాము. మా ప్రభుత్వం రాగానే ఈ పాలసీని రద్దు చేస్తాము. అవసరమైతే ఇందుకోసం ఒక చట్టాన్ని తీసుకువస్తాము అన్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి భూ కుంభకోణంలో భాగస్వాములు కావద్దని పారిశ్రామికవేత్తలకు విజ్ఞప్తి చేస్తున్నాము. ఎవరైనా అత్యాశకు వెళ్లి ప్రభుత్వానికి డబ్బులు కడితే, అటు పారిశ్రామిక భూములతో పాటు డబ్బులు కూడా పోతాయన్న విషయాన్ని గుర్తుంచుకోండని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఇంతటి భారీ కుంభకోణాన్ని, దోపిడీని చూసి తట్టుకోలేక… తెలంగాణ పట్ల ప్రేమ ఉన్న ఓ తెలంగాణ బిడ్డ మాకు సమాచారం ఇచ్చారు. ప్రభుత్వం చేస్తున్న దోపిడీ పైన మేము అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా, సమాచారం లీక్ అయింది అంటూ ప్రభుత్వం బాధపడుతోంది. చిత్తశుద్ధి ఉంటే తమ ప్రభుత్వం చేస్తున్న దోపిడీ పైన ప్రజలకు సమాధానం చెప్పాలి అన్నారు. ఈరోజు మేము పర్యటిస్తున్న జీడిమెట్ల ప్రాంతంలో మార్కెట్ ధర గజానికి కనీసం లక్ష రూపాయలు ఉంది. కానీ ప్రభుత్వం మాత్రం కేవలం 4,000 రూపాయలకే పూర్తిగా భూమిని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడతామని చెబుతోందనారు. ఒకవైపు 170 కోట్ల రూపాయలకు ఎకరం చొప్పున భూములు అమ్మిన ప్రభుత్వం అంటూ రోజు వార్తలు రాయించుకుంటున్న సర్కార్, మరోవైపు కేవలం కోటి రూపాయలకు ఎకరం చొప్పున జీడిమెట్లలో భూమిని ఎలా అమ్ముతుంది? ఇది కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుంభకోణానికి క్షేత్రస్థాయిలో ఉన్న నిదర్శనం అని అన్నారు.
గతంలో తెచ్చిన గ్రిడ్ (GRID) పాలసీ ద్వారా కేవలం ఐటీ కార్యాలయాలు మాత్రమే నిర్మాణం చేసేందుకు అవకాశం ఉండేది. ఐటీ కార్యాలయాల ఏర్పాటు వలన ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో పాటు ఆర్థిక కార్యకలాపాలు కూడా పెరుగుతాయి, పరోక్షంగా అనేకమందికి ఉపాధి లభిస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, మా పాలసీ ఆదర్శం అయితే… ఈ పారిశ్రామిక భూములలో ఎలాంటి కాలుష్యం లేని పరిశ్రమలకు మాత్రమే తిరిగి భూములు కేటాయించాలి. ఐటీ వంటి పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు మాత్రమే అనుమతించాలి. అంతేకానీ అప్పనంగా అపార్ట్మెంట్లకు, విల్లాలకు ఇస్తామంటే కుదరదు అన్నారు. హైదరాబాద్ నగరం నుంచి కాలుష్య కారక పరిశ్రమలను బయటకి పంపించాలన్నది అందరి ఉద్దేశం. అందుకే ఎలాంటి పొల్యూషన్ లేని అంతర్జాతీయ స్థాయి ఫార్మాసిటీని ఏర్పాటు చేశాము. దాన్ని కూడా రేవంత్ రెడ్డి తన రియల్ ఎస్టేట్ వ్యాపారానికి వాడుకుంటున్నాడని ధ్వజం ఏతారు. రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ పేరుతో ఫార్మాసిటీ భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. రేవంత్ రెడ్డికి తెలిసింది కేవలం రియల్ ఎస్టేట్ దందా మాత్రమే. అందుకే అక్కడ ఫార్మాసిటీలోనూ, ఇక్కడ పారిశ్రామిక భూముల్లోనూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు అన్నారు. అనంతరం జీడిమెట్ల పారిశ్రామిక లోని పలు పరిశ్రమలను సందర్శించి కార్మిక సమస్యలపై కార్మికులతో, పారిశ్రామిక వేత్తలతో చర్చించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
పారిశ్రామిక ప్రాంతాల్లో బిఆర్ఎస్ బృందాల పర్యటన
హిల్ట్ పాలసీతో కాంగ్రెస్ రూ.5 లక్షల కోట్ల భూకుంభకోణం చేస్తోందని ఆరోపిస్తూ బిఆర్ఎస్ పారిశ్రామిక వాడల్లో బృందాలుగా పోరు బాట చేపట్టింది. ఈ మేరకు పారిశ్రామిక భూముల బదలాయింపు విధానంపై బిఆర్ఎస్ నియమించిన నిజనిర్ధారణ బృందాలు గురువారం క్షేత్రస్థాయిలో పర్యటించాయి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతంలో కెటిఆర్ నేతృత్వంలోని బృందం, సనత్నగర్ ఇండస్ట్రియల్ ప్రాంతంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ నేతృత్వంలోని బృందం, బహదూర్పూర్ చందూలాల్ బరదరి ఇండస్ట్రియల్ ఏరియాలో మాజీ హోం మంత్రి మహమూద్ అలీ, బిఆర్ఎస్ ఎంఎల్సి దాసోజు శ్రవణ్, ఇతర నేతలు పర్యటించి కార్మికులతో మాట్లాడారు. ఆయా ప్రాంతాలో అక్కడి స్థానిక నాయకులను, ప్రజలను కలుపుకొని హిల్ట్ పాలసీతో జరిగే నష్టాలను, వాస్తవ మార్కెట్ విలువకు, ప్రభుత్వం నిర్ణయించిన ధరకు ఉన్న భారీ వ్యత్యాసాన్ని ప్రజలకు వివరించారు. ఒకప్పుడు అక్కడ పారిశ్రామిక వాడల ఏర్పాటు కోసం ప్రజలు భూములు ఇచ్చిన తీరును ప్రభుత్వం కేటాయించిన తీరును వాటిని చవకగా పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వాలు కట్టబెట్టిన అంశాన్ని, వాటి ఉద్దేశాలను పార్టీ నేతల బృందాలు ప్రస్తావించారు. 5 లక్షల కోట్ల భూ కుంభకోణంపై క్షేత్రస్థాయిలో పోరాడతామని కెటిఆర్ వెల్లడించారు.