మన తెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్ మహానగర పరిధిలోని 5లక్షల కోట్ల విలువైన పారిశ్రామిక భూములను హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ(హిల్ట్) పేరుతో ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకునేందుకు బిఆర్ఎస్ పార్టీ పోరుబాటకు సిద్ధమైంది. పార్టీ అధినేత కెసిఆర్ ఆదేశాల మేరకు, వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ రాష్ట్రవ్యాప్తంగా సీనియర్ నాయకులతో కూడిన నిజనిర్ధారణ బృందాలను నియమించారు. ఈ మేరకు పార్టీ ముఖ్య నేతలు, మాజీ మంత్రులు, ఎంఎల్ఎ లు, ఎంఎల్సిలతో కెటిఆర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించి, క్షేత్రస్థాయి ప ర్యటనలపై దిశానిర్దేశం చేశారు. గత ప్రభుత్వాలు పరిశ్రమల స్థాపన కోసం, ఉపాధి కల్పన కోసం అతి తక్కువ ధరకే కేటాయించిన భూములను, ఇప్పుడు ‘మల్టీ యూజ్ జోన్’ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి మారుస్తున్నారని ఆరోపించారు. సుమారు 9,300 ఎకరాల భూ ములను మార్కెట్ విలువ కంటే అతి తక్కువకు, కేవలం ఎస్.ఆర్.ఓ రేటులో 30 శాతానికే రెగ్యులరైజ్ చేసి, సుమారు రూ. 5 లక్షల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టే కుట్ర జరుగుతోందని పేర్కొన్నారు. పేదలకు ఇందిరమ్మ ఇళ్లు కట్టడానికి, కనీసం స్మశాన వాటికలకు కూడా స్థలాలు లేవని చెబుతున్న ప్రభుత్వం, వేల కోట్ల విలువైన భూములను మాత్రం ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేస్తోందని మండిపడ్డారు.
నేడు,రేపు పారిశ్రామిక వాడల్లో పర్యటన
ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న పారిశ్రామిక వాడలను 8 క్లస్టర్లుగా విభజించి, పార్టీ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో బృందాలు పర్యటించనున్నాయి. అక్కడ స్థానిక నాయకులను, ప్రజలను కలుపుకొని వాస్తవ మార్కెట్ విలువకు, ప్రభుత్వం నిర్ణయించిన ధరకు ఉన్న భారీ వ్యత్యాసాన్ని ప్రజల ముందు ఉంచనున్నారు. వీటితోపాటు అక్కడి పారిశ్రామిక వాడల ద్వారా ప్రజా ఉపయోగ కార్యక్రమాలు ఏమేమి చేయవచ్చు, అక్కడి స్థానిక ప్రజల సుదీర్ఘకాలం డిమాండ్లను, ఆకాంక్షలను పార్టీ నేతలు తెలుసుకోనున్నారు. హిల్ట్ పి స్కామ్పై నిజనిర్ధారణ కోసం బిఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన ఎనిమిది బృందాలు బుధ, గురువారాలు (డిసెంబర్ 3, 4) ఆయా ప్రాంతాల్లో పర్యటించనున్నాయి. ఇందులో భాగంగా బుధవారం బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో పర్యటిస్తారు. ఎమ్మెల్యేలు, ఇతర నేతలు బృందాలుగా ఏర్పడి వివిధ ప్రాంతాలలో పర్యటించనున్నారు.