ఎపిలోని ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో ఓ రివాల్వర్ కలకలం సృష్టించింది. శ్రీశైలం టోల్గేట్ వద్ద మంగళవారం ఉదయం జరిగిన తనిఖీల్లో రివాల్వర్ బయటపడటంతో కొద్ది సేపు ఉద్రిక్త పరిస్థితి ఉత్పన్నమైంది. దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది వాహనాలను తనిఖీ చేస్తుండగా ఒక వ్యక్తి దగ్గర 9 ఎమ్ఎమ్ పిస్టల్ రివాల్వర్ ఉండటం గమనించారు. వెంటనే వారు అక్కడే విధుల్లో ఉన్న పోలీసులకు సమా చారం ఇచ్చారు. దీంతో, పోలీసులు రివాల్వర్ కలిగి ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. తనను మధ్యప్రదేశ్కు చెందిన సైబర్ క్రైమ్ శాఖలో ఎస్ఐగా పనిచేస్తున్నానని ఆ వ్యక్తి తెలిపాడు. అతని వద్ద ఉన్న రివాల్వర్ లైసెనస్డ్ ఆయుధమని,
అధికారిక కారణాలతో ప్రయాణిస్తున్నానని తెలిపాడు. శ్రీశైలం సిఐ ప్రసాద్రావు ఆ వ్యక్తి వద్ద ఉన్న ఐడి కార్డు, రివాల్వర్ను స్వాధీనం చేసుకుని, దర్యాప్తు నిర్వహించారు. మధ్యప్రదేశ్ సైబర్ క్రైమ్ ఎస్పితో సంప్రదించి సదరు వ్యక్తి వివరాలు నిర్ధారించుకున్నారు. విచారణలో అతను నిజంగానే మధ్యప్రదేశ్ సైబర్ క్రైమ్ విభాగంలో సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నట్లు వెల్లడైంది. దీంతో పోలీసులు అతని రివాల్వర్, ఐడి కార్డులను తిరిగి అప్పగించారు. కొద్ది సేపు ఆందోళన కలిగించిన ఈ ఘటనలో ఆ రివాల్వర్ కలిగి ఉన్న వ్యక్తి నిజంగానే పోలీసు అధికారి అని తేలడంతో ఆ రివాల్వర్ ఉత్కంఠ వీడింది. దీంతో, భక్తులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.