హైదరాబాద్: దేశం కోసం గాంధీ కుటుంబం త్యాగం చేసిందని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. నేషనల్ హెరాల్డ్ సిబ్బందికి ఆర్థిక సాయం అందించారని అన్నారు. ఈ సందర్భంగా గాంధీభవన్ లో సిఎం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై కేసులు పెడితే భయపడేది లేదని సూచించారు. ప్రైవేటు సంస్థల్లో పని చేసిన వారికి బెనిఫిట్స్ ఉండవని, ఎప్పుడో మూతపడిన నేషనల్ హెరాల్డ్ సిబ్బందికి మంచి ఆలోచనతో ఆర్థికంగా ఆదుకున్నారని తెలియజేశారు. పత్రికను తిరిగి నడిపించాలంటే బోర్డు ఆఫ్ డైరెక్టర్లుగా కొంతమంది కాంగ్రెస్ నాయకులు తీసుకున్నారని, కాంగ్రెస్ పార్టీకి ఒక పత్రిక ఉండాలని నేషనల్ హెరాల్డ్ పత్రిక పునరుద్ధరించే ప్రక్రియ చేపట్టారని రేవంత్ పేర్కొన్నారు. షేర్ క్యాపిటల్ కు సంబంధించి కాంగ్రెస్ పార్టీ నుంచి నిధులు బదిలీ చేసి రిటర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చారని, ఏ ఒక్క రూపాయి ప్రభుత్వానికి సంబంధించినది కాదని..అన్నారు.
ఎవరూ జేబులో ఒక్క రూపాయి కూడా వేసుకోలేదని, ఆస్తులన్నీదివంగత మాజీ ప్రధానమంత్రి నెహ్రూ గాంధీవే..వారసత్వంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ పత్రిక నడపాలని ప్రయత్నించారని చెప్పారు. మనీలాండరింగ్ కేసు, ఇడి కేసులు పెట్టి మానసికంగా సోనియా, రాహుల్ ను వేధిస్తారా? అని ప్రశ్నించారు. మానసిక ధైర్యం కోల్పోకుండా సోనియా, రాహుల్ కేసులను ఎదుర్కొంటున్నారని, దేశం కోసం ప్రాణాలిచ్చిన కుటుంబం నుంచి వచ్చామని.. ఇలాంటి కేసులకు భయపడమని సవాల్ చేశారు. దేశ స్థాయిలో ఓట్ల చోరీ కార్యక్రమాన్ని బయటపెట్టే సరికి భయపడే వేధింపులు? అని మండిపడ్డారు. దేశవ్యాప్తంగా ఓట్ల చోరీ ప్రచారాలను అడ్డుకోవాలనే సోనియా, రాహుల్ పై మళ్లీ కేసులు పెట్టారని ధ్వజమెత్తారు. సోనియా, రాహుల్ పై పెట్టిన అక్రమ కేసులను ఖండిస్తూ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాస్తున్నానని, సోనియా, రాహుల్ కు తెలంగాణ ప్రజలంతా అండగా నిలబడతామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.