మన తెలంగాణ/హైదరాబాద్: తన పాత బాస్ చంద్రబా బు నాయుడికి కోపం వస్తుందనే సిఎం రేవంత్రెడ్డి పాలమూరు ప్రాజెక్టును పక్కనపెట్టారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆరోపించారు. కృష్ణా నది నుంచి నీళ్లు తీసుకుంటే చంద్రబాబుకు కోపం వస్తుందని, అందుకే ప్రాజెక్టును పండబెట్టి కాలువలు కూడా తవ్వడం లేదని పే ర్కొన్నారు. కెసిఆర్కు మంచి పేరు వస్తుందనే పాలమూరు -రంగారెడ్డి పనులను ప్రభుత్వం చేయటంలేదని, దీనివల్ల అంతిమంగా రాష్ట్రానికే నష్టమని అన్నారు. శాసనసభ ఆవరణలో సోమవారం కెటిఆర్ మీడియా ప్రతినిధులతో నిర్వహించిన చిట్చాట్లో పలు అంశాలపై మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు కెసిఆర్ హయాంలోనే పూర్తయిందని, అందుకు కెసిఆర్ నిబద్ధతే కారణం అని స్పష్టం చేశారు. కాళేశ్వరంలో రంద్రాన్వేషణ చేస్తే రాష్ట్రానికి నష్టం జరుగుతుందే తప్ప రాజకీయంగా తమకు నష్టం జరగదని అన్నారు. పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో 45 టిఎంసిలకు ఒప్పుకుంటే అది నష్టమే అవుతుందని చెప్పారు. 299 టిఎంసిలకు ఒప్పుకున్నది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వమేనని గుర్తుచేశారు. దాని ఆధారంగానే తమ ప్రభుత్వం మరిన్ని నీటి కేటాయింపుల కోసం కేంద్రాన్ని కోరిందని అన్నారు. అయినప్పటికీ పాలమూరు ప్రాజెక్టును రేవంత్ రెడ్డి కావాలనే పండబెట్టాడని ఆరోపించారు.
కెసిఆర్పై మాట్లాడితే ఊరుకునేది లేదు
రేవంత్ రెడ్డి అవినీతి, అక్రమాలు బయటపడుతున్నాయనే కారణంతోనే ఆయన బూతులు మాట్లాడుతున్నారని కెటిఆర్ ఆరోపించారు. తనపై వ్యాఖ్యలు చేస్తే తాను స్పందించనని, కానీ తన తండ్రి కెసిఆర్పై మాట్లాడితే మాత్రం ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. మీడియా ముందు కెసిఆర్ గారు లేవనెత్తిన ప్రశ్నలకు కాంగ్రెస్ సమాధానం చెప్పలేక బూతులు మాట్లాడుతున్నది అన్నారు. అలాంటప్పుడు కేసీఆర్ను అసెంబ్లీకి రావాలని డిమాండ్ చేయడం హాస్యాస్పదమన్నారు. నీళ్ల సబ్జెక్ట్ నాలుగు రోజులు చదివితే రాదని, రాష్ట్రంపై ప్రేమ ఉండాలని వ్యాఖ్యానించారు. కృష్ణా నది ఏ బేసిన్లో ఉందో, ఎక్కడ ఉందో అని సిఎం అడిగిన పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. బాక్రా నంగల్ ఏ రాష్ట్రంలో ఉందో కూడా తెలియని ముఖ్యమంత్రి ఉన్నారని విమర్శించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును అడ్డుకున్న వ్యక్తే ఈరోజు నీటిపారుదల శాఖ సలహాదారుడిగా ఉన్నారని పేర్కొన్నారు. పాడి కౌశిక్ రెడ్డి సభలో మేడిగడ్డను ఎవరో బాంబులు పెట్టి పేల్చారని స్పష్టంగా చెప్పారని పేర్కొన్నారు. చెక్ డ్యాం పేల్చివేత కేసులో రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ ఉన్నదని చెప్పారు. మేడిగడ్డ పేల్చారని ఇంజనీర్లు ఆనాడే ఫిర్యాదు చేశారని, అయినా ఎందుకు విచారణ చేపట్టడం లేదని ప్రశ్నించారు.
డబ్బు కోసమే జిహెచ్ఎంసి విభజన
జిహెచ్ఎంసిని మూడు భాగాలుగా విభజిస్తారన్న ప్రచారం జరుగుతోందని, ఫోర్త్ సిటీ అని పెట్టిన దానిని కూడా కార్పొరేషన్ చేస్తారేమోనని కెసిఆర్ పేర్కొన్నారు. ఏం చేసినా శాస్త్రీయంగా ఉండాలని, ఇష్టం వచ్చినట్లు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. జిహెచ్ఎంసిలో కాంగ్రెస్, ఎంఐఎం ఏం చేసుకుంటారో, ఎవరికీ లాభం చేకూర్చేలా చేసుకుంటారో వారి ఇష్టమని వ్యాఖ్యానించారు. కేవలం డబ్బుల సేకరణ కోసం మర్చంట్ బ్యాంకర్లు, బ్రోకర్లు చెప్పినట్లు డిలిమిటేషన్ చేస్తున్నారని ఆరోపించారు. ఈ విభజన మొత్తం డబ్బుల కోసమే అని, అడ్డగోలుగా విభజన చేశారని విమర్శించారు.
ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేయడం లేదని సిఎం చెప్పగలరా?
శాంతిభద్రతలు, రాష్ట్ర రక్షణ కోసమే ఇంటెలిజెన్స్ వ్యవస్థ పనిచేస్తుందని కెటిఆర్ అన్నారు. నిఘా వ్యవస్థ లేదా ఫోన్ ట్యాపింగ్ లేదని ఇప్పుడు ఎవరైనా అనగలరా..? అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాప్ చేయడం లేదని సిఎం చెప్పగలరా..? అని ప్రశ్నించారు. ట్యాపింగ్ నిజం కాకపోతే అధికారులు ఎందుకు ప్రెస్మీట్ పెట్టడం లేదని అడిగారు. ఇన్ని సిట్లు, విచారణలు, కేసుల పేరుతో సాధించింది ఏమిటని అడిగారు. ఈ డైవర్షన్లను ప్రజలు గ్రహిస్తున్నారని, అందుకే సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలు తమ పార్టీకి ఓటు వేశారని చెప్పారు. కెసిఆర్ అంటే రేవంత్రెడ్డికి గౌరవం ఉంటే చాలని కెటిఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ తెచ్చిన నాయకుడిగా కెసిఆర్ పట్ల తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికీ గౌరవం ఉంటుందని చెప్పారు. ముఖ్యమంత్రి హోదాలో శాసనసభలో కెసిఆర్ను కలిసేంత సంస్కారం ఉంటే చాలని వ్యాఖ్యానించారు. ఇదే సంస్కారం బయట మాటల్లో కూడా ఉంటే బాగుంటుందని అన్నారు.
గడ్డం పెంచినోళ్లంతా గబ్బర్ సింగ్ కాలేదు
గడ్డం పెంచినోళ్లంతా గబ్బర్ సింగ్ కాలేరని కెటిఆర్ విమర్శించారు. గడ్డాలు పెంచడం చాలా ఈజీ…పాలన చేయడమే కష్టం అని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి గడ్డం, మీసాలు లేవని అన్నది తనను కాదు అని, రాహుల్ గాంధీని, రాజీవ్ గాంధీని కూడా అన్నారని చెప్పారు. తాను ఆంధ్రాలో చదివితే తప్పు అంటారని, కానీ అల్లుడిని మాత్రం ఆంధ్ర నుంచి తెచ్చుకున్నారని ఎద్దేవా చేశారు.
పార్టీని వీడిన వారిని మళ్లీ తీసుకోం..
అధికారం కోల్పోగానే, ఆదరించిన పార్టీని వీడిన నేతలను తిరిగి పార్టీలోకి ఆహ్వానించకూడదనేది తన అభిప్రాయమని కెటిఆర్ చెప్పారు. బిఆర్ఎస్ నుంచి బిజెపిలోకి వెళ్లిన నేతల నియోజకవర్గాల్లో ఎన్ని సర్పంచ్ స్థానాలు గెలిచారని ప్రశ్నించారు. నేతల బలం లేకున్నా కూడా బిఆర్ఎస్ కార్యకర్తలు సర్పంచ్లను గెలిపించుకున్నారని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల నాటికి ఇప్పటికి పరిస్థితులు మారాయని అన్నారు. పంచాయితీలలో తమ పార్టీ గొప్ప ఫలితాలు సాధించిందని చెప్పారు.