ప్రభుత్వ ఆశయాలను నెరవేర్చేలా రెవెన్యూ ఉద్యోగులు పని చేయాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. గతేడాదిలో ఏ విధంగా ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లారో కొత్త సంవత్సరంలోనూ అదే విధంగా పని చేయాలని మంత్రి సూచించారు. తెలంగాణ రెవెన్యూ జేఏసి చైర్మన్ వి.లచ్చిరెడ్డి నేతృత్యంలో డిప్యూటీ కలెక్టర్ల సంఘం, తెలంగాణ తహశీల్దార్స్ అసోసియేషన్, తెలంగాణ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ నేతలు మంత్రి పొంగులేటిని సోమవారం కలిశారు. అనంతరం తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ (టిజిఆర్ఎస్ఏ) నూతన సంవత్సర డైరీ, క్యాలండర్లను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హైదరాబాద్లోని తన చాంబర్లో ఆవిష్కరించి మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ గతేడాదిలో రైతులకు భూ సమస్యల పరిష్కారం కోసం భూభారతి చట్టాన్ని తెచ్చామన్నారు.
భూభారతి చట్టం రాకతో రెవెన్యూ సేవలు క్షేత్రస్థాయిలోనూ అందుబాటులోకి వచ్చాయన్నారు. కేంద్రీకృతమై ఉన్న రెవెన్యూ సేవలను వికేంద్రీకరణ చేశామన్నారు. గ్రామాల్లోనే రైతులకు రెవెన్యూ సేవలను అందించేందుకు గ్రామ పాలనా అధికారుల(జీపీఓ)ను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ఏ విధమైన భూ సమస్య ఉన్న జిల్లా స్థాయిలోనే పరిష్కారం అయ్యేలా చూశామన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ, తెలంగాణ తహసీల్దార్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.రాములు, మహిళా విభాగం అధ్యక్షురాలు ఎం.రాధ, సెక్రటరీ జనరల్ పూల్సింగ్ చౌహాన్, తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బాణాల రాంరెడ్డి, మహిళా విభాగం అధ్యక్షురాలు సుజాత చౌహాన్, తెలంగాణ తహసీల్దార్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ పాక, తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.భిక్షం, టిజిటిఏ, టిజిఆర్ఎస్ఏ రాష్ట్ర నాయకులు జయశ్రీ, రాంబాబు, మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.