న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ సహా దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వాయు కాలుష్యం తీవ్రంగా ఉన్న వేళ ఎయిర్ ప్యూరిఫ్లైయర్లపై 18 శాతం జీఎస్టీ కొనసాగిస్తుండటంపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ వీటిపై జీఎస్టీ తగ్గించే అంశాన్ని ఎందుకు పరిశీలించడం లేదని కేంద్రాన్ని ప్రశ్నించింది. దీనిపై వివరణ ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. ఎయిర్ ప్యూరిఫ్లైయర్లను వైద్యపరంగా పరిగణించి , వాటిని 5 శాతం జిఎస్టీ శ్లాబులోకి తీసుకొచ్చేలా ఆదేశాలివ్వాలంటూ ఢిల్లీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన డివిజన్ బెంచ్ కేంద్రం తీరుపై అసహనం వ్యక్తం చేసింది. “మనం రోజుకు 21 వేల సార్లు శ్వాస తీసుకుంటాం. అలాంటప్పుడు గాలి కాలుష్యం వల్ల ఎంత నష్టం జరుగుతుందో ఓసారి లెక్కించండి” అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ఈ పిటిషన్పై స్పందించేందుకు సమయం ఇవ్వాలంటూ ప్రభుత్వం చేసిన అభ్యర్థనపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. “వాయు కాలుష్యం వల్ల వేలాదిమంది చనిపోతున్నారు. ప్రతి పౌరుడికి స్వచ్ఛమైన గాలి అవసరం. అది అందించలేనప్పుడు కనీసం ఎయిర్ ప్యూరిఫైయర్లనైనా అందుబాటు ధరల్లో ఉంచాలి కదా. ఇలాంటి ఎయిర్ ఎమర్జెన్సీలో జాతీయ భద్రతా చట్టం కింద తాత్కాలిక చర్యలు చేపట్టలేదా? ఎయిర్ ప్యూరిఫ్లైయర్లపై తక్షణం మినహాయింపులు ఇవ్వలేరా” అని ధర్మాసనం కేంద్రాన్ని ప్రశ్నించింది. దీనిపై ఈ రోజే తమ స్పందన తెలియజేయాలని ప్రభుత్వం తరఫు న్యాయవాదిని ఆదేశించింది.