తెలంగాణలో నడుస్తోంది ప్రజా పాలన కాదు.. ‘పక్కా మాఫియా పాలన’ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఎక్స్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు. నాడు ఎన్నికల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు మీద బాంబులు వేశారు..నేడు ఇసుక మాఫియా కోసం ఏకంగా చెక్ డ్యామ్ల మీద జెలటిన్ స్టిక్స్తో బాంబులు వేస్తున్నారని ఆరోపించారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వాటర్ మ్యాన్ రాజేంద్ర సింగ్ ‘ఇది మానవ నిర్మిత విధ్వంసం’ అని మొత్తుకుంటున్నా, ఈ ‘చిట్టి నాయుడి’ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. డ్రిల్లింగ్ మెషీన్లతో హోల్స్ చేసి, జెలటిన్ స్టిక్స్ పెట్టి పేల్చారని ఆయన సాక్ష్యాలతో సహా నిరూపించారని అన్నారు. ఇసుకను దోచుకోవడానికి అడ్డుగా ఉన్నాయని, కోట్ల రూపాయల ప్రజా ధనంతో కట్టిన చెక్ డ్యామ్లను డైనమైట్లు పెట్టి పేల్చేస్తారా.. ఇది ప్రభుత్వమా లేక గ్యాంగ్ స్టర్ల అడ్డాయా..? అని ప్రశ్నించారు.
భూగర్భ జలాలు పెరగాలని తాము చెక్ డ్యామ్లు కడితే.. వాటిని కూల్చివేసి రైతుల పొలాలను ఎడారిగా మారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక కాంట్రాక్టర్ల లాభాల కోసం తెలంగాణ రైతాంగం బలి కావాలా..? అని నిలదీశారు. ప్రకృతి వైపరీత్యం వల్ల కూలిపోయాయని కట్టుకథలు అల్లిన కాంగ్రెస్ మంత్రులకు రాజేంద్ర సింగ్ రిపోర్ట్ చెంపపెట్టు అని పేర్కొన్నారు. ఇప్పుడు మీ సమాధానం ఏంటి అని సిఎం రేవంత్ రెడ్డిని అడిగారు.అభివృద్ధి చేయడం చేతకాదు కానీ, ఉన్న ఆస్తులను కూల్చడంలో మీరు సిద్ధహస్తులు అంటూ సిఎంను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. తెలంగాణ ఆస్తులపై బాంబులు వేస్తున్న మాఫియా వెనుక ఉన్న అసలు దొంగలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. రాజేంద్ర సింగ్ డిమాండ్ చేసినట్లు పీపుల్స్ ఎంక్వైరీ కమిషన్ వేయాల్సిందే అని, లేదంటే ఈ బాంబుల సెగ సిఎం కుర్చీ దాకా రావడం ఖాయం అని పేర్కొన్నారు.