హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసుల వార్తలపై మాజీ మంత్రి హరీశ్ రావు స్పందించారు. రాష్ట్రంలో సిట్లు ఒక ప్రహసనం అయ్యాయని ఎద్దేవా చేశారు. డిఫెన్స్లో పడింది కాబట్టి నాకు నోటీసు ఇస్తారట అని అన్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసే 3వ తేదీ సాయంత్రం నోటీసు ఇవ్వమని చెప్పారట అని.. కొందరు అధికారులు పోస్టింగుల కోసం అక్రమ కేసులు పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి మెప్పు కోసం అతి చేస్తే మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. ఎపిలో ఏం జరిగిందో అందరూ చూశారు కాదా అని.. రాజకీయ కక్షతో ఇబ్బంది పెడితే మీకు అదే గతి పడుతుందని వార్నింగ్ ఇచ్చారు.
తమకు త్యాగాల చరిత్ర ఉందని.. అరెస్టులకు భయపడేది లేదని హరీశ్ స్పష్టం చేశారు. అరెస్టు చేస్తే చేసుకోండి, ఇంకా రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తామని అన్నారు. అతిగా వ్యవహరించే అధికారుల పేర్లు బుక్లో రాస్తున్నామని.. అక్రమాలు, అరాచకాలు, సెటిల్మెంట్లు అన్ని నమోదు చేస్తున్నామని పేర్కొన్నారు. బిఆర్ఎస్ పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్న వారిని గమనిస్తున్నామని అన్నారు. అతిగా వ్యవహరించే పోలీసు అధికారులను వదిలిపెట్టేది లేదని రిటైర్ అయినా, విదేశాల్లో ఉన్నా, కేంద్ర సర్వీసులకు వెళ్లినా పట్టుకొస్తామని హెచ్చరించారు.