మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రైజింగ్ 2047 పేరిట తెచ్చిన విజన్ డాక్యుమెంట్ను అభినందించారు సరే, కానీ ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీల సంగతేంటి..?, మ్యానిఫెస్టో అమలు పరిస్థితిపై ఎప్పుడైనా అడిగి తెలుసుకున్నారా అని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీని ప్రశ్నించారు. రెండేళ్ల పాలనలో ప్రభుత్వ పనితీరు, రాష్ట్ర అభివృద్ధి విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూరదృష్టిని అభినందించిన మీరు ఎన్నికల వాగ్ధానాల ప్రణాళిక, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలుపై ఎప్పుడైనా ఆరా తీశారా, ఎంత వరకు అమలు చేశారని వివరణ అడిగారా అని ప్రశ్నించారు. ఆదివారం కేంద్రమంత్రి కిషన్రెడ్డి సోనియా గాంధీకి బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీల అమలు గురించి గానీ, 6 గ్యారంటీలు ప్రజలకు అందించారా లేదా అనే వాస్తవాలు గానీ మీకు తెలిసినట్లు లేదని, తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించినట్లు కూడా లేదని ఆ లేఖలో పేర్కొన్నారు.
కానీ, ఇచ్చిన హామీలు వదిలివేసి తెలంగాణ ప్రజలను వంచిస్తూ, ప్రజలను మోసం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి పేరిట విజన్ డాక్యుమెంట్ తో కొత్త పల్లవి అందుకొని మీ పార్టీ, మీరు ఒకరినొకరు అభినందించుకుంటున్నారని విమర్శించారు. ఆనాడు ఎన్నికల సమయంలో మోసపూరిత హామీలు ఇచ్చి అధికారం చేపట్టిన మీరు, మళ్లీ ఇప్పుడు రాష్ట్రంలో విజన్ డాక్యుమెంట్ పేరిట కొత్త హామీలు ఇస్తున్నారని అన్నారు. మరి ఎన్నికలప్పుడు ఇచ్చిన గ్యారంటీలను గాలికొదిలేశారా? ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన 420 హామీలను మూసీ నదిలో కలిపేలేశారా? లేక గాంధీ భవన్లో పాతరేశారా? తెలంగాణ ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని ఆ లేఖలో నిలదీశారు.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడిచిపోయింది, ఇప్పటికైనా కొత్త ఊహలు, కొత్త ఆశలు, కొత్త హామీలు కల్పించేముందు గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంపై ఇచ్చిన మాట మీద నిలబడాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. లేదంటే మీరు ప్రయోగించిన అభయహస్తమే ప్రజల ఆగ్రహం రూపంలో మీ పాలిట భస్మాసుర హస్తమై మిమ్మల్ని అధికారానికి దూరం చేయకుండా మానదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా గ్యారంటీల పేరుతో రైతులు, మహిళలు, నిరుద్యోగులు, విద్యార్థులు, దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలకు ఇచ్చిన హామీల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని మనవి చేస్తున్నానని తెలిపారు. మీరు ఇచ్చిన హామీల అమలులో మోసం చేస్తే, భవిష్యత్తులో తెలంగాణ ప్రజలు కూడా మీకు మద్దతు ఇచ్చే విషయంలో ప్రతిచర్యలకు పాల్పడి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరిస్తున్నానని కిషన్రెడ్డి తెలిపారు.