రూ.25వేల కోట్లు ఖర్చుపెట్టి పాలమూరుకు చుక్క నీళ్లు ఇవ్వలేదు
45 టిఎంసిలకు తగ్గించామన్నది అవాస్తవం
కేంద్రం నుంచి డిపిఆర్ వెనక్కి వచ్చింది మీ హయాంలోనే: మంత్రి ఉత్తమ్
మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కేసీఆర్ తాకట్టు పెట్టారని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఇరిగేషన్ వ్యవస్థను కేసీఆర్ సర్వనాశనం చేశారని మండిపడ్డారు. కాళేశ్వరం తెలంగాణకు గుండెకాయ అని లక్షల కోట్లు పోసి కట్టారని, తీరా చూస్తే ఆ ప్రాజెక్టు కుప్పకూలిపోయిందని మంత్రి ఉత్తమ్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేసీఆర్ చేసిన ఆరోపణలపై స్పందిస్తూ ఆదివారం రాత్రి సచివాలయంలో మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు 90 శాతం అబద్ధం అని అన్నారు. లక్షల కోట్లు బూడిదలో పోసిన పన్నీరుగా మారిందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల తెలంగాణలో ఒక్క రైతుకు లాభం జరుగలేదని తెలిపారు. కేవలం కమీషన్ల కోసమే భారీ ప్రాజెక్టు కట్టారని అన్నారు. కేవలం రైతులు, ప్రాజెక్టులనే కాకుండా మహిళలు, నిరుద్యోగులు, విద్యార్థులు అందరినీ కేసీఆర్ మోసం చేశారని అన్నారు. అన్ని వర్గాలను సమన్వయం చేసుకుంటూ వెళుతున్న తమకు కేసీఆర్ నీతులు చెప్పడం బాగోలేదని, కేసీఆర్ నోటి వెంట నీతులు వింటుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లే ఉందని విమర్శించారు.
పాలమూరును మోసం చేసింది మీరే
కృష్ణా జలాల విషయంలో పాలమూరు ప్రజలను మోసం చేసింది మీరే నని కేసీఆర్ కు ఉత్తమ్కుమార్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. రూ.25 వేల కోట్లు ఖర్చు చేసి ఒక్క ఎకరాకు నీరు ఇవ్వలేదని విమర్శించారు. పాలమూరు విషయంలో, ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్ వ్యాఖ్యలు అబద్ధాలన్నారు. పదేళ్ల పాలనలో లక్ష ఎకరాలకు కూడా కొత్త ఆయకట్టు నీరు ఇవ్వలేదని, పాలమూరు రంగారెడ్డిలో 45 టీఎంసీలు తగ్గించామన్నది అబద్ధం అన్నారు. ఇరిగేషన్ ను నాశనం చేసింది మీరు..రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది మీరు.. కృష్ణా జలాల విషయంలో పాలమూరును మోసం చేసింది మీరు..2023 ఏప్రిల్ 12 న డీపీఆర్ వెనక్కు పంపారని, అప్పుడు సీఎం, ఇరిగేషన్ మంత్రి మీరే కదా..? మీరు ఇచ్చిన జీవో ప్రకారమే 45 టీఎంసీలు కృష్ణా నుంచి, 45 టీఎంసీలు గోదావరి నుంచి ఇవ్వాలని కోరామన్నారు. 500 టీఎంసీలు ఏపీ వాడుకునేందుకు మీరు రాసివ్వలేదని చెప్పే దమ్ముందా..? అని ఉత్తమ్కుమార్రెడ్డి ప్రశ్నించారు.
ఏపీ నీటిని తరలించుకుపోతుంటే ఏం చేశారు
ఉమ్మడి రాష్ట్రంలో 750 టీఎంసీలు తరలించుకుపోతే మీ పాలనలో 1400 టీఎంసీలు తరలించుకోయారని, ఏపీ నీటిని తరలించుకుపోతుంటే ఏం చేశారని కెసిఆర్ ను మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి నిలదీశారు. అందుకు సహకరించింది మీరు కాదా..? ఇప్పుడు చెప్పండి ఎవరు మోసం చేశారోనని కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో లక్షా 80 వేల కోట్లు ఖర్చు చేసి రైతులకు చేసింది సున్నా అని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పాలమూరు రంగారెడ్డికి 7 వేల కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే సమర్థవంతంగా కృష్ణా ట్రిబ్యునల్ లో పోరాడుతున్నామని అన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్నా దేవాదులను పట్టించుకోలేదని విమర్శించారు. మీరు లక్ష కోట్లు ఖర్చు చేసిన కాళేశ్వరం కూలిపోయిందని, ప్రాణహిత చేవెళ్ల రద్దు చేసి రాష్ట్రానికి అన్యాయం చేశారని ఆరోపించారు. పదేళ్లలో కల్వకుర్తి, నెట్టెంపాడు, డిండి, బీమా, ఎస్ ఎల్ బీసీ మొదలైన ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. పోలవరం- నల్లమల సాగర్ ప్రాజెక్టు ఆపాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశామని, ఎవరు మోసం చేశారో..? కేసీఆర్ కరెక్ట్గా ప్రిపేరై రావాలని, లేదంటే ఇలాగే లెక్కలు తెలియకుండా మాట్లాడుతారన్నారు. కృష్ణా బేసిన్లో కేసీఆర్ చేసింది దగా, మోసం అని ఉత్తమ్కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.