మన తెలంగాణ/హైదరాబాద్ : సిఎం రేవంత్రెడ్డి నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టుకు శనివారం హాజరయ్యారు. గతంలో ఉస్మానియా విశ్వ విద్యాలయం, తిరుమలగిరి, మట్టంపల్లి పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల విచారణ సందర్భంగా ఆయన కోర్టుకు వ్యక్తిగతంగా హాజరయ్యా రు. ఈ మూడు కేసుల్లో ఎగ్జామినేషన్ ప్రక్రియ పూర్తి అయినట్లు సమాచారం. ఓయూలో నిబంధనలకు విరుద్ధంగా బహిరంగ సభ నిర్వహించా రనే ఫిర్యాదుపై 2016లో రేవంత్ రెడ్డిపై ఓయూ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అలాగే.. తిరుమలగిరి, మట్టంపల్లి పోలీస్ స్టేషన్లలో కూడా వివిధ కారణాలతో ఆయనపై కేసులు నమోదు అయ్యాయి.
ఈ క్రమంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం, తిరుమలగిరి, మట్టంపల్లి పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులను క్వాష్ చేయాలని రేవంత్ రెడ్డి నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టును ఆశ్రయించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా.. రాజకీయ ఒత్తిళ్లతో తనపై అక్రమంగా కేసులు బనాయించారని పిటిషన్ దాఖలు చేశారు. రేవంత్ రెడ్డి పిటిషన్పై ప్రస్తుతం ప్రజా ప్రతినిధుల కోర్టులో విచారణ నడుస్తోంది. ఈ క్రమంలోనే విచారణలో భాగంగా శనివారం (డిసెంబర్ 20) ఆయన కోర్టుకు వ్యక్తిగతంగా హాజరయ్యారు. కాగా ఈ మూడు కేసులు ప్రధానంగా ఎన్నికల కోడ్ ఉల్లంఘనలు, పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు లేదా రాజకీయ కార్య క్రమాల సందర్భంలో నమోదయినవి.
గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఈ కేసులు నమో దయ్యాయి. కోర్టులో జడ్జి ముందు రేవంత్ రెడ్డి ఎగ్జామినేషన్ (ప్రశ్నోత్తరాలు) ప్రక్రియ పూర్తి చేశారు. మూడు కేసుల్లోనూ ఈ దశ పూర్తయిన నేపథ్యంలో తదుపరి విచారణ లేదా తీర్పు కోసం కోర్టు తేదీ నిర్ణయించనుంది. సిఎం హాజరుతో కోర్టు పరిసరాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. మీడియా, సామాన్యులను కోర్టు హాల్ సమీపంలోకి అనుమతించలేదు. కాంగ్రెస్ నేతలు ఈ కేసులను రాజకీయ కుట్రతో మోపినవని విమర్శి స్తున్నారు.