హైదరాబాద్: ప్రజావాణి ప్రారంభించిన రెండేళ్లలో ఇప్పటివరకూ అందిన ఫిర్యాదుల్లో 74 శాతం ఫిర్యాదులు పరిష్కరించామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయమని ఆయన పేర్కొన్నారు. ప్రజా భవన్లో జరిగిన రాష్ట్రస్థాయి ప్రజావాణి 2వ వార్షికోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా భట్టి.. అంకితభావంతో సేవలు అందించి.. ఫిర్యాదుల పరిష్కారానికి కృషి చేసిన అధికారులను సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని వివిధ వర్గాల నుంచి వస్తున్న అనేక సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందించి, అన్ని శాఖలతో సమన్వయం చేస్తున్నామని తెలిపారు.
ప్రజావాణికి స్పందన లేదని విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని భట్టి ఆక్షేపించారు. ఎంత దుష్ప్రచారం చేసినా.. ప్రజా సమస్యలు పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. అధికారానికి దూరమైన విపక్షం ఎన్ని విమర్శలు చేసినా.. తాము ముందుకు వెళ్తామని అన్నారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో వనరులు ప్రజలకు ఉపయోగపడేలా కృషి చేస్తున్నామని హామీ ఇచ్చారు. ప్రజావాణి విజయవంతం చేసిన చిన్నారెడ్డి, దివ్యాదేవరాజన్కు భట్టి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ప్రజావాణి ఇన్చార్జి దివ్యదేవరాజన్ తదితరులు పాల్గొన్నారు.