పంచాయతీ ఎన్నికల ఫలితాలు చూసిన సిఎం రేవంత్ రెడ్డి ఫ్రస్టేషన్ పీక్స్కు చేరిందని మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎంఎల్ఎ హరీష్రావు విమర్శించారు. రోజురోజుకీ పరిస్థితులు చేజారి పోతున్నాయనే సత్యం జీర్ణం కాక అవాకులు చెవాకులు పేలుతూ అక్కసు వెళ్లగక్కారని మండిపడ్డారు. త్వరలోనే తనకు పతనం తప్పదనే సంగతి అర్థమై ఆగమాగం అవుతున్నారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. త్వరలోనే తన కుర్చీ ఊడుతుందని, తన దోపిడీ ఆగిపోతుందనే భయంతో రేవంత్ రెడ్డి మీడియా సమవేశంలో అడ్డగోలుగా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు, కెటిఆర్కు మధ్య మిత్ర బేధం సృష్టించాలని, తద్వారా బిఆర్ఎస్ను బలహీన పరచాలని రేవంత్రెడ్డి ఒక చీప్ ట్రిక్ ప్లే చేస్తున్నారని ఆరోపించారు. కానీ రేవంత్ రెడ్డి చీప్ ట్రిక్కులకు, చిల్లర రాజకీయాలకు ఎవరు పడిపోరు అని, ఆయన కుట్రలు, కుత్సితాలు ఫలించవు గాక ఫలించవు అని పేర్కొన్నారు. ఎప్పటికైనా హరీష్ రావు గుండెల్లో ఉండేది కెసిఆరే, హరీశ్ రావు చేతిలో ఉండేది గులాబీ జెండానే అని మరోసారి స్పష్టం చేశారు.
రేవంత్రెడ్డి దాష్టీకాలు, దుర్మార్గలకు వ్యతిరేకంగా తానూ, కెటిఆర్ మరింత సమన్వయంగా, మరింత సమర్థవంతంగా రెట్టించిన ఉత్సాహంతో పోరాడుతాం, ఆయన అవినీతిని ఎండగడుతాం, అసమర్థతను నిలదీస్తామని వెల్లడించారు. ఉద్యమ కాలం నుంచి నేటి దాకా తెలంగాణకు తీరని ద్రోహం చేస్తున్న రేవంత్రెడ్డిని, కాంగ్రెస్ను గద్దె దించుతామని, తన లక్ష్యమైనా, కెటిఆర్ లక్ష్యమైనా, లక్షలాది గులాబీ సైనికుల లక్ష్యమైనా ఇదే అని ప్రకటించారు. బిఆర్ఎస్ విజయపథంలో పురోగమించడం ఖాయం..మరోసారి కెసిఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయం..తెలంగాణ ప్రజల ఆకాంక్షలను సంపూర్ణంగా నెరవేర్చడం ఖాయం అంటూ ధీమా వ్యక్తం చేశారు. రేవంత్రెడ్డి చిల్లర వేషాలు, చెత్త రాజకీయాలను చూసి ప్రజలు ఛీ కొడుతున్నారంటూ ధ్వజమెత్తారు. మిగిలిన కొద్ది కాలమైనా సరిగ్గా వినియోగించుకోవాలని హితవు పలికారు. కమీషన్లు, రియల్ ఎస్టేట్ దందాలే కాదు..ప్రజలకు అక్కరకు వచ్చే పనులు చేయాలని, లేకుంటే ఉద్యమ ద్రోహి గానే కాదూ, చేవలేని, చేతగాని ముఖ్యమంత్రిగా కూడా చరిత్రలో నిలిచిపోతావు అని పేర్కొన్నారు.