న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో వ్యాట్ విధింపు ఎక్కువ కావడంతో పెట్రోల్ డీజిల్ ధరలు ఎక్కువగా ఉండగా.. చిన్న రాష్ట్రాలు, అండమాన్ నికోబార్ వంటి కేంద్ర పాలిత ప్రాంతాల్లో చాలా తక్కువగా ఉన్నాయని రాజ్యసభ సోమవారం వెల్లడించింది. పెట్రోలు ధరలు లీటరుకి..ఆంధ్రప్రదేశ్ లో రూ.109.74, అండమాన్ నికోబార్లో రూ. 82.46 గా ఉందని కేంద్ర పెట్రోలియం, సహజవాయువు సహాయ మంత్రి సురేశ్ గోపీ లిఖిత పూర్వకంగా వెల్లడించారు. ఇంధనం ధరల్లో వ్యత్యాసంపై అడిగిన ప్రశ్నకు ఆయన సమాధారం ఇచ్చారు. పెట్రోల్, డీజిల్ అమ్మకం ధరలు కేంద్ర ప్రభుత్వం విధించిన ఎక్సయిజ్ డ్యూటీ, ఆయా రాష్ట్రాలు విధించిన వ్యాట్ (వాల్యూయాడెట్ టాక్స్ ) కలుపుకుని ఉంటాయని వివరించారు.
రవాణా ఛార్జీల్లో తేడాలు, వ్యాట్ /రాష్ట్రాలు, /కేంద్ర పాలిత ప్రాంతాలు విధించే వాటితో రాష్ట్రానికి, రాష్ట్రానికి తేడా ఉంటుందన్నారు. ఎన్డిఎ పాలిత ఆంధ్రప్రదేశ్ అత్యధికంగా పెట్రోల్పై లీటరుకు రూ. 29.06 వంతున వ్యాట్ విధించిందని, అదే అండమాన్ నికోబార్లో అయితే కేవలం రూ. 0.82 మాత్రమే ఉందని వివరించారు. ఎక్సయిజ్ డ్యూటీగా కేంద్ర ప్రభుత్వం లీటరు పెట్రోల్పై అత్యధికంగా వ్యాట్ రూ.21.90 వంతున విధించిందని చెప్పారు. ఇక డీజిల్ విషయంలో ఆంధ్రప్రదేశ్లో లీటరుకు వ్యాట్ రూ.21.56 కలుపుకుని రూ. 97.87 కాగా, అండమాన్ నికోబార్లో లీటరుపై కనీస వ్యాట్ రూ.0. 77తో కలిపి రూ. 78.05 హైదరాబాద్లో లీటరు రూ.95.70 వంతున ధర పలుకుతున్నట్టు వివరించారు.