మనతెలంగాణ/హైదరాబాద్: రైతుల నీటి హక్కులపై ఉద్యమానికి ప్రతిపక్ష బిఆర్ఎస్ పార్టీ సమాయత్తమవుతోంది. బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు అధ్యక్షతన ఈ నెల 19వ తేదీన తెలంగాణ భవన్లో మధ్యాహ్నం 2 గంటలకు బిఆర్ఎస్ఎల్పి సమావేశం, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం జరుగనున్నది. కృష్ణా, గోదావరి జలాలతోపాటు సాగునీటి ప్రాజెక్టులపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. కృష్ణా గోదావరి జలాల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి, పదేండ్ల బిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టులను నేటి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు తీసుకు పోవడంలో చూపిస్తున్న నిర్లక్ష్య వైఖరి మీద చర్చించనున్నారు. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గోదావరి కృష్ణా జలాలను కొల్లగొడుతున్న కూడా దానిని అడ్డుకునే విషయంలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, ఇటువంటి సందర్భంలో తెలంగాణ ప్రజల రైతాంగ సాగునీటి హక్కులను కాపాడుకోవడానికి మరో ప్రజా ఉద్యమం తప్పదని బిఆర్ఎస్ భావిస్తున్నది. ఇందులో భాగంగా తదుపరి నిర్మించబోయే తెలంగాణ ప్రజా ఉద్యమాలకు సంబంధించి పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో లోతుగా చర్చించనున్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు గత బిఆర్ఎస్ ప్రభుత్వం 91 టిఎంసిలు కేటాయిస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కేవలం 45 టిఎంసిలు ఇస్తే చాలు అని కేంద్రం ముందు దేబరించడం బాధాకరమని, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి 45 టిఎంసిలకు అంగీకరిస్తూ కేంద్రం వద్ద మోకరిల్లి రావడం రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలను తాకట్టు పెట్టడమే అని,
కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం చేయడమే అని బిఆర్ఎస్ పార్టీ పేర్కొంటుంది. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి నల్లగొండ ప్రజల రైతాంగ ప్రయోజనాలు దెబ్బతింటున్న నేపథ్యంలో, తెలంగాణ రాష్ట్రం నుంచి ఎనిమిది మంది బిజెపి ఎంపిలు ఉండి కూడా ఒక్కరూ మాట్లాడిన పాపాన పోవట్లేదని, బిజెపి పార్టీయే తెలంగాణ ప్రయోజనాలకు రైతాంగ ప్రయోజనాలకు గండి కొడుతున్నదనేది స్పష్టమవుతున్నదని బిఆర్ఎస్ అభిప్రాయపడుతోంది. తెలంగాణ రాష్ట్రానికి సాగునీటి విషయంలో కేంద్ర బిజెపి చేస్తున్న అన్యాయాన్ని కానీ., కావేరి తదితర నదుల అనుసంధానం పేరుతో ఆంధ్ర రాష్ట్ర జలదోపిడికి సహకరిస్తున్న కేంద్ర బిజెపి విధానాన్ని గానీ ఎదుర్కోవాలంటే.. తెలంగాణ సమాజం మరొకసారి ప్రత్యక్ష పోరాటాలే శరణ్యం అని పార్టీ అధినేత కెసిఆర్ భావిస్తున్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వమే గనక తిరిగి వచ్చి ఉంటే ఈపాటికి పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు నుంచి నీళ్లు అందేవి అని, పాలమూరు రంగారెడ్డి నల్గొండ ప్రజల, రైతాంగ ప్రయోజనాలు కాపాడబడేవి అని పేర్కొన్నారు.
కానీ ఇప్పుడు వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం, పాలమూరు రంగారెడ్డి నల్గొండ ప్రజల ప్రయోజనాల పట్ల పూర్తి నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించడం వల్ల పూచిక పొల్లంత పని కూడా చేయలేకపోవడం వల్ల ఆ ప్రాంతం ప్రజలు రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నారని, రెండేళ్లు గడిచినా కూడా తెలంగాణ రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలను నిర్లక్ష్యం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇంకా తెలంగాణ సమాజం మౌనం వహించ జాలదు అని, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు, కృష్ణా జలాలలో కేవలం 45 టిఎంసిలు ఒప్పుకోవడం అనేది ఘోరాతి ఘోరం, దుర్మార్గం… కాబట్టి సాగునీరు తెలంగాణ రైతాంగ ప్రయోజనాలను కాపాడే విషయంలో బిఆర్ఎస్ పార్టీ ఎన్నటికీ రాజీ పడబోదు అని పార్టీ స్పష్టం చేసింది. ఇటువంటి కీలక సమయంలో పైన తెలిపిన విషయాలతో పాటు, పార్టీ సంస్థాగత నిర్మాణ విషయాలు సహా పలు అంశాలను.. ఈనెల 19వ తేదీన నిర్వహించబోయే సంయుక్త సమావేశంలో పార్టీ అధినేత కెసిఆర్ అధ్యక్షతన కూలంకషంగా చర్చించనున్నారు. అందుకు అనుగుణంగా చేపట్టబోయే ప్రజా ఉద్యమాలను నిర్మాణం, అనుసరించాల్సిన కార్యాచరణపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ,పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల నిర్మాణం, జలాల కేటాయింపు, గోదావరి కృష్ణా జలాల విషయంలో, ఆంధ్ర జలదోపిడి పైన పోరాడేందుకు.. ఒక ఉద్యమ స్వరూపానికి ఈ సమావేశంలో శ్రీకారం చుట్టనున్నారు.