ఎపిలోని బాపట్ల జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. భార్యను గొంతు నులిమి హత్య చేసిన భర్త ఆమె మృతదేహాన్ని బైక్పై తీసుకొచ్చి నేరుగా పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. సంతమాగులూరు మండలంలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం ఏల్చూరుకు చెందిన వెంకటేశ్వర్లు, పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం మాచవరానికి చెందిన మహాలక్ష్మి (28) కొన్నేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే, గత కొంత కాలంగా వీరి మధ్య విభేదాలు తలెత్తడంతో మహాలక్ష్మి భర్త నుంచి విడిపోయి పుట్టింట్లో ఉంటోంది.
ఈ క్రమంలో ఆదివారం వెంకటేశ్వర్లు మాచవరం వెళ్లి మహాలక్ష్మిని కలిశాడు. ఆమెకు సంబంధించిన బంగారం తిరిగి ఇచ్చేస్తానని నమ్మించి గ్రామ శివారు ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ ఇద్దరి మధ్య మళ్లీ వాగ్వాదం జరగడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన వెంకటేశ్వర్లు ఆమె గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం మహాలక్ష్మి మృత దేహాన్ని తన బైక్పైనే ఉంచి సంతమాగులూరు పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటనతో విస్మయానికి లోనైన పోలీసులు వెంటనే మృత దేహాన్ని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. మహాలక్ష్మి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అనంతరం రొంపిచర్ల పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.