భారత దేశంలో డిజిటల్ యుగంలో ప్రజల జీవితాలు మొబైల్ ఫోన్లతో ముడిపడి ఉన్నాయి. ప్రతి సందేశం, ప్రతి కాల్, ప్రతి లొకేషన్… ఇవన్నీ మన స్వేచ్ఛా జీవితాలలో భాగం. కానీ, నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇటీవల జారీచేసిన ఒక ఆదేశం ఈ స్వేచ్ఛను ఆపదకు గురిచేస్తోంది. ‘సంచార సాథి’ అనే యాప్ను అన్ని స్మార్ట్ ఫోన్లలో బలవంతంగా ప్రీ -ఇన్స్టాల్ చేయాలని కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖ సెల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్, అసెంబ్లింగ్, కంపెనీలను, యూనిట్స్ ను ఆదేశించింది. ఇది ఫోన్ దొంగతనాలు, స్కామ్లు నిరోధించడానికి ఉపయోగపడుతుందని ప్రభుత్వం చెబుతోంది. అయినప్పటికీ, ఈ వాదానికి వ్యతిరేక (సాంకేతిక నిపుణులు) వాదులు చెప్పేది ఏమిటంటే, ప్రైవసీ యాక్టివిస్టులు దీన్ని ‘స్నూపింగ్ యాప్’గా, పెగాసస్ 2.0 బ్రాండ్ అని పిలుస్తున్నారు. ఇది రక్షణ వాగ్దానమా లేక ప్రజలను పర్యవేక్షించే గూఢచార (స్పై) ఆయుధమా? ఈ వివాదం మన డిజిటల్ హక్కులపై లోతైన ప్రశ్నలను లేవనెత్తుతోంది.
‘సంచార సాథి’ యాప్ 2023 మే లో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్స్ (డాట్) చేత ప్రవేశపెట్టబడింది. ఇది ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ) ప్లాట్ ఫామ్గా, మొబైల్ యూజర్లకు ఫోన్ గుర్తింపు (ఐఎంఇఐ వెరిఫికేషన్), కోల్పోయిన డివైస్లు ట్రాకింగ్, అనధికార సిమ్లు బ్లాక్ చేయడం వంటి సౌకర్యాలు అందిస్తుంది. ప్రభుత్వం ప్రకారం, 2023 నుంచి 6 లక్షలకు పైగా కోల్పోయిన ఫోన్లు పునరుద్ధరించబడ్డాయి. ఒక్క క్షణానికి ఒక ఫోన్ ట్రేస్ అవుతోంది. 57 లక్షల సిమ్లు బ్లాక్ చేయబడ్డాయి, 17 వేల దొంగ ఫోన్లు అడ్డుకున్నాయి. ఇది ‘డిజిటల్ భారత్’ విజన్లో భాగంగా, సైబర్ సెక్యూరిటీని బలోపేతం చేస్తుందని యూనియన్ టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా చెబుతున్నారు. ‘ఇది ఐచ్ఛికం, డిలీట్ చేయవచ్చు’ అని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం యాప్ ‘పర్సనల్ డేటా’ స్వయం చాలకంగా క్యాప్చర్ చేయదని, యూజర్ అనుమతి లేకుండా ఏమీ చేయదని వాదిస్తోంది. టెలికాం సైబర్ సెక్యూరిటీ రూల్స్ 2024 కింద జారీ చేసిన ఈ ఆదేశం, 90 రోజుల్లో అమలు చేయాలని ఆపిల్, సామ్సంగ్, గూగుల్, షియోమీ వంటి కంపెనీలకు ఆదేశించింది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఫోన్లకు సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా ఇన్స్టాల్ చేయాలని కూడా చెప్పారు.
కానీ ఈ ‘సేఫ్టీ ప్రామిస్’ వెనుక దాగిఉన్న వాస్తవాలు భయభ్రాంతులు కలిగిస్తున్నాయి. యాప్కు కాల్స్, మెసేజెస్, స్టోరేజ్, లొకేషన్, కెమెరా యాక్సెస్ అవసరమవుతుంది. ఇది (ఐఎంఇఐ) స్నూఫింగ్ను నిరోధిస్తుందని చెప్పినా, ఇది ప్రజల ఫోన్ యాక్టివిటీని పూర్తిగా మానిటర్ చేసే బ్యాక్ డోర్గా మారే అవకాశం ఉందని, అపోజిషన్ నేతలు (కొందరు ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీ కమ్యూనికేషన్ సాంకేతిక నిపుణులు) దీన్ని ‘బిగ్ బ్రదర్’ వాచింగ్గా వర్ణిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ‘ఇది బిజెపి అధికారులతో ప్రజల మాటపై నిఘా పెట్టడానికి మరో ప్రయత్నం’ అని, ‘మరో డిక్టేటర్షిప్’ గా అభివర్ణించారు. ప్రియాంక గాంధీ ‘స్నూపింగ్ యాప్’ అని ‘ఫ్రాడ్ రిపోర్టింగ్, మధ్యలో ప్రతి పౌరుడు ఫోన్ను చూసే వ్యక్తి గత సమాచార సేకరణ’ అని విమర్శించారు. కాంగ్రెస్ ఎంపి రేణుక చౌదరి పెగాసస్తో పోల్చి, ‘ఎంపిలు, ఎంఎల్ఎల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి’ అని ఆరోపించారు. ఎఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసి ‘ప్రజల ప్రైవసీని ధ్వంసం చేసే మోడీ ప్రభుత్వం మరో ప్రయత్నం’ అని ట్వీట్ చేశారు. ఇంటర్నెట్ ఫ్రీడమ్ ఫౌండేషన్ ‘ఇది రీసెండ్ అయ్యే వరకు పోరాటం చేస్తాం’ అని ప్రకటించింది.
ఈ విమర్శలు ఆధార్ రహితం కాదు. 2017లో సుప్రీం కోర్టు ప్రైవసీని ఆర్టికల్ 21 కింద ప్రాథమిక హక్కుగా గుర్తించింది. కానీ, మోడీ ప్రభుత్వం అప్పటి నుంచి ప్రైవసీకి వ్యతిరేకంగా నిలబడింది. ‘పెగాసస్ స్కాండల్’ లో ప్రభుత్వం ‘జవాబుదారీతనం చూపలేదు’. ఇప్పుడు సంచార సాథి 73 కోట్ల స్మార్ట్ ఫోన్లలో బలవంతంగా రావడం, ఇది మాస్ సర్వెయిలెన్స్ టూల్గా మారే అవకాశం ఉంది. యాప్ ‘రెడిలీ విజిబుల్’ గా ఉండాలి, ‘డిసేబుల్’ చేయకూడదని ఆదేశం. ఇది యూజర్ ఎంపికను బలహీనపరుస్తుంది. ఆపిల్, సామ్సంగ్ వంటి కంపెనీలు ఇంకా కంప్లయి చేయడానికి మానసికంగా తమ సంసిద్ధతను చూపలేదు. ఆపిల్ ‘ప్రైవసీ రిస్క్లు’ అని చెప్పి, మధ్య మార్గంలో ప్రజలు నిత్యజీవితంపై 27X7 నిఘాను ఉంచాలని చూస్తోంది. ఇది ఆర్థిక బలవంతంపై కంపెనీలు భారత మార్కెట్ను కోల్పోవడానికి తోడ్పడతాయి.
ప్రభుత్వ వాదనలు ఆకర్షణీయంగా ఉన్నా, వాటిలో లోపాలు ఉన్నాయి. (ఐఎంఇఐ) మిస్యూజ్ నిరోధం అవసరమే. కానీ.. దానికి మొత్తం పాపులేషన్ను స్కాన్ చేయాలా? యూరపులో (జిడిపిఆర్) వంటి చట్టాలు ప్రైవసీని ప్రాధాన్యత ఇస్తాయి. ఇక్కడ మాత్రం ‘సేఫ్టీ’ పేరుతో సర్వైలెన్స్ జస్టిఫై చేస్తున్నారు. ఈ యాప్ డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? ఎవరు యాక్సెస్ చేస్తారు? పార్లమెంట్లో చర్చ లేకుండా రహస్యంగా జారీ చేయడం డెమోక్రసీకి విరుద్ధం అని విపక్షాలు విమర్శలు, హెచ్చరికలు చేస్తున్నాయి. వ్యతిరేకులు చెప్పేది సరైనదే. -ఇది డిసెంట్ను ట్రాక్ చేయడానికి ఉపయోగపడుతుంది. మీడియా రిపోర్టుల ప్రకారం, ఇది ‘పర్మినెంట్ సర్వెయి లెన్స్ బ్యాక్ డోర్’ గా మారవచ్చు. ఫైనాన్షియల్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం, మోడీ ప్రభుత్వం ఇప్పటికే ‘లాఫుల్ ఇంటర్సెప్షన్’ సిస్టమ్ల ద్వారా స్నూపింగ్ చేస్తోంది.
ఈ వివాదం మన డిజిటల్ భవిష్యత్తును ప్రశ్నిస్తోంది. సర్వైలెన్స్ రాజ్యంలో ప్రజలు స్వేచ్ఛగా మాట్లాడలేరు, రాజకీయాలు చేయలేరు. ప్రభుత్వం ‘సేవా తీర్థ్’ పేరుతో పిఎంఒను మార్చుకుంటుండగా, ప్రజల హక్కులు కోల్పోతున్నాయి. ఈ విషయంలో సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవాలి. పార్లమెంటరీలో చర్చ జరిగి, ట్రాన్స్పరెంట్ పాలసీ రూపొందించాలి. యాప్ ఐచ్ఛికంగా ఉంచి, స్ట్రాంగ్ డేటా ప్రొటెక్షన్ లాస్ తీసుకు రావాలి. లేకపోతే, డిజిటల్ భారత్ ‘డిస్టోపియన్ భారత్’ గా మారిపోతుంది. ప్రజలు మొబైల్లను ఆఫ్ చేసి, ప్రైవసీకై పోరాడాలి. ఇది కేవలం యాప్ వివాదం మాత్రమే కాదు. మన స్వేచ్ఛా, స్వాతంత్య్రాలపై చట్ట రీత్యా యుద్ధం చేయటమే.
– డా. కోలాహలం రామ్ కిశోర్
9849328496