ప్రధాని నరేంద్ర మోడీతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి భేటీ అయ్యారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సిఎం రేవంత్రెడ్డి బుధవారం ఉదయం డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్కతో కలిసి ప్రధానిని కలిశారు. ప్రస్తుతం పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నందున పార్లమెంట్ భవనంలోనే ప్రధానితో రేవంత్ రెడ్డి భేటీ అయి ఈనెల 8, 9వ తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు రావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా సమ్మిట్ గురించి సిఎం రేవంత్రెడ్డి అరగంట పాటు ప్రధానికి వివరించారు. దాదాపు అరగంటపాటు జరిగిన ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాల గురించి సిఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ మెట్రోరైలు రెండో దశ విస్తరణకు అనుమతి ఇవ్వాలని ప్రధాని మోడీని సిఎం రేవంత్ కోరారు. మొత్తం 162.5 కిలోమీటర్ల పొడవునా విస్తరించే ప్రతిపాదనలను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అందచేసింది.
దీనికి రూ.43,848 కోట్ల అంచనా వ్యయమయ్యే అవకాశం ఉందని, ఈ ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాయింట్ వెంచర్గా చేపట్టేందుకు ఆమోదించాలని ప్రధానికి సిఎం రేవంత్రెడ్డి విజ్ఞప్తి చేశారు. రీజనల్ రింగ్రోడ్డు ఉత్తర భాగానికి కేబినెట్ ఆమోదంతో పాటు ఫైనాన్షియల్ అప్రూవల్ ఇవ్వాలని, దక్షిణభాగం నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని సిఎం రేవంత్రెడ్డి ప్రధానికి విజ్ఞప్తి చేశారు.హైదరాబాద్ నుంచి అమరావతి మీదుగా బందర్ పోర్ట్ వరకు 12 లేన్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే, హైదరాబాద్ నుంచి బెంగళూరుకు హైస్పీడ్ కారిడార్ను అభివృద్ధి చేసేందుకు గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ నిర్మాణం చేపట్టేలా కేంద్రం ప్రత్యేక చొరవ చూపాలని సిఎం రేవంత్రెడ్డి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ నుంచి శ్రీశైలం పుణ్యక్షేత్రానికి నిరంతరాయంగా రవాణా సదుపాయం ఉండేలా టైగర్ రిజర్వ్ మీదుగా మన్ననూర్ నుంచి శ్రీశైలం వరకు నాలుగు లేన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ ప్రతిపాదనలను ఆమోదించాలని సిఎం ప్రధానికి విజ్ఞప్తి చేశారు.