హైదరాబాద్: నగరంలో పరిశ్రమలు ఒఆర్ఆర్ వెలుపలకు తరలించాలనేది తమ ప్రణాళిక అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. హిల్ట్ పాలసీ ఎన్నో రకాలుగా ప్రయోజనకరం అని అన్నారు. ఈ సందర్భంగా గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హిల్ట్ పాలసీ వల్ల ప్రభుత్వానికి ఆదాయం కూడా వస్తుందని తెలియజేశారు. ఏం చేసినా ప్రభుత్వాన్ని తప్పు పట్టాలనే ధోరణి ప్రతి పక్ష నేతల్లో కనిపిస్తోందని విమర్శించారు. వచ్చే ఆదాయాన్ని సంక్షేమ, అభివృద్ధి పనులకు ఉపయోగిస్తామని తెలియజేశారు. కొత్తగా చేపట్టే థర్మల్ విద్యుత్ ప్లాంట్ పై కూడా అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ప్రతి పక్ష నేతలపై మండిపడ్డారు. విభజనచట్టం ప్రకారం నిర్మించాల్సిన విద్యుత్ ప్లాంట్ ఎందుకు పూర్తి చేయలేదో చెప్పాలని ఉత్తమ్ ప్రశ్నించారు. భద్రాద్రి విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి కాలం చెల్లిన పద్ధతిలో గత ప్రభుత్వం చేపట్టిందని, సబ్ క్రిటికల్ పద్ధతి వల్ల ఆర్థికంగా, పర్యావరణ పరంగా తీవ్రమైన నష్టం కలుగుతుందని ధ్వజమెత్తారు. భద్రాద్రి పవర్ ప్లాంట్ ను పూర్తిగా వినియోగించుకోలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. యాదాద్రి పవర్ ప్లాంట్ లో విద్యుత్ ఉత్పత్తి కూడా భారంగా మారిందని, ఛత్తీస్ గఢ్ నుంచి చేసిన విద్యుత్ కొనుగోళ్లలోనూ అవకతవకలు జరిగాయని అన్నారు. ఇంకా మంజూరు చేయని, నిర్మాణం జరగని విద్యుత్ ప్లాంట్ లో అవినీతి ఎలా జరుగుతుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి నిలదీశారు.