హైదరాబాద్ మహానగర అపురూపమైన చరిత్రను, వాస్తు నిర్మాణ వైభవాన్ని, ఉజ్వలమైన స్ఫూర్తిని అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించడానికి హైదరాబాద్ హెరిటేజ్ రన్ -2026ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు. ఈ కార్యక్రమ వివరాలను చారిత్రక తారామతి బారామతి వేదికగా మంగళవారం వెల్లడించారు. పర్యాటక, సాంస్కృతిక (క్రీడలు) శాఖ ఆధ్వర్యంలో రాపిడో టైటిల్ స్పాన్సర్గా ఈ చారిత్రక క్రీడా కార్యక్రమం జరుగుతుందని మంత్రి తెలిపారు. ఈవెంట్కు తెలంగాణ టూరిజం, స్పోర్ట్ అథారిటీ ఆఫ్ తెలంగాణ సహకారం అందిస్తున్నాయని తెలిపారు.హైదరాబాద్ మహానగర వైభవాన్ని, చారిత్రక ప్రాధాన్యతను ప్రపంచానికి చాటి చెప్పేందుకు తారామతి బారామతిని వేదికగా ఎంచుకున్నట్లు చెప్పారు. హైదరాబాద్ హెరిటేజ్ రన్ కేవలం ఒక పరుగు మాత్రమే కాదని, క్రీడలు, పర్యాటకం, సాంస్కృతిక గర్వానికి సంబంధించిన మహా వేడుక అన్నారు.
చార్మినార్ నుంచి కుతుబ్ షాహీ సమాధుల వరకు మార్గాన్ని సజీవ వారసత్వ కారిడార్గా మారుస్తున్నామని వెల్లడించారు. దీని ద్వారా హైదరాబాద్ను వారసత్వ క్రీడా పర్యాటకానికి ప్రపంచ గమ్యస్థానంగా సుస్థిరం చేయాలనేదే తమ లక్ష్యమని అన్నారు. హైదరాబాద్ నగర వాసులు, యువత క్రీడాభిమానులు పాల్గొని హైదరాబాద్ హెరిటేజ్ రన్ను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీ క్రాంతి వల్లూరు, హైదరాబాద్ ర్యాపిడో హెడ్ ఉమేష్, తదితరులు పాల్గొన్నారు. ఈ ఈవెంట్ ఫిబ్రవరి 1, 2026న జరగనుంది. నగర చరిత్రను ప్రత్యక్షంగా అనుభూతి చెందేలా రూట్ మ్యాప్ను సిద్ధం చేశారు. 21కే హాఫ్ మారథాన్ ఐకానిక్ చార్మినార్ వద్ద మొదలై కుతుబ్ షాహీ సమాధుల వద్ద ముగుస్తుంది. మార్గంలో హైకోర్టు, సిటీ కాలేజ్, అసెంబ్లీ, గోల్కొండ కోట, తారామతి బారామతి వంటి ప్రధాన చారిత్రక ప్రదేశాలను చుట్టి వస్తుంది. 5కే, 10కే రన్ చారిత్రక కుతుబ్ షాహీ సమాధుల వద్ద ప్రారంభమై అక్కడే ముగుస్తుంది.