నారాయణ్పుర్: విద్యార్థులు హోం వర్క్ చేయకపోతే.. టీచర్లు శిక్ష విధించడం సాధారణమే. రెండు దెబ్బలు వేయడమో.. లేక ఏదైనా చిన్న శిక్ష విధిస్తుంటారు. కానీ, ఇక్కడ ఇద్దరు టీచర్లు మాత్రం మితిమీరి.. అమానవీయంగా ప్రవర్తించారు. హోం వర్క్ చేయలేదని ఐదేళ్ల బాలుడికి దారుణమైన శిక్ష విధించారు. ఆ బాలుడిని చెట్టుకు వేలాడదీశారు. సూరజ్పుర్ జిల్లా నారాయణ్పుర్లోని హంసవాణి విద్యామందిర్లో ఈ ఘటన చోటు చేసుకుంది.
స్థానికుల్లో ఒకరు ఈ ఉదంతాన్ని వీడియో తీసి సోషల్మీడియాలో పోస్ట్ చేయడంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ చర్యకు పాల్పడిన టీచర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు. పాఠశాల వద్ద పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. దీనిపై జిల్లా విద్యాశాఖ స్పందిస్తూ.. దీనిపై దర్యాప్తునకు ఆదేశించామని.. సమగ్ర విచారణ జరుపుతామని పేర్కొంది. తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. కాగా, పాఠశాలకు చెందిన సుభాష్ శివహరే అనే వ్యక్తి ఈ చర్యను సమర్థిస్తూ మాట్లాడటం గమనార్హం. ఇది చిన్న శిక్ష అని.. విద్యార్థుల్లో భయం కలిగించేందుకు ఇలా చేశామని వ్యాఖ్యానించాడు. సుభాష్ వ్యాఖ్యలు గ్రామస్థుల ఆగ్రహాన్ని మరింత పెంచాయి.