హైదరాబాద్: సిపి విసి సజ్జనార్, ఐపిఎస్ రాత్రి వేళల్లో పోలిసింగ్ను మరింత బలోపేతం చేయడంతో పాటు, క్షేత్రస్థాయిలో సిబ్బంది ఎలా స్పందిస్తున్నారన్న విషయాన్ని ప్రత్యక్షంగా పరిశీలించేందుకు ఆకస్మిక పర్యటనలు చేస్తున్నామని తెలిపారు. పీపుల్ వెల్ఫేర్ పోలిసింగ్లో భాగంగా చేపడుతున్న ఈ పర్యటనలు సిబ్బంది బాధ్యతా భావాన్ని పెంపొందించడమే కాకుండా, సేవల నాణ్యతను మెరుగుపరుస్తాయని అన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ సిపి విసి సజ్జనార్, ఐపిఎస్ మాట్లాడుతూ .. ఎంత మేర అప్రమత్తంగా ఉన్నారని, రాత్రి వేళల్లో ప్రజల భద్రత కోసం ఎలాంటి చర్యలు చేపడుతున్నారని, అనేక అంశాలపై క్షేత్రస్థాయిలో నేరుగా ఆరా తీశారు. విధుల్లో ఉన్న కానిస్టేబుళ్లు, అధికారులను స్వయంగా కలుసుకుని, గస్తీ పాయింట్లు, స్పందన వేగం, సమస్యల పరిష్కారంపై వివరాలు తెలుసుకున్నామని అన్నారు.
విజిబుల్ పోలిసింగ్కు ప్రాధాన్యం ఇవ్వాలని సిబ్బందికి సూచించారు. నగరంలో నేరాలపై కఠినమైన పర్యవేక్షణలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఆదివారం అర్ధరాత్రి సౌత్ వెస్ట్ జోన్లో నగర ఆకస్మిక పర్యటన చేశారు. అర్థరాత్రి పెట్రోలింగ్ వాహనంలో స్వయంగా గస్తీ నిర్వహించారు. రాత్రి 12:00 గంటల నుండి 3:00 గంటల వరకు లంగర్ హౌస్, టోలిచౌకి పోలీస్ స్టేషన్ల పరిధిలోని రహదారులు, కీలక ప్రాంతాలు, సున్నితమైన పాయింట్లను ప్రత్యక్షంగా సజ్జనార్ పరిశీలించారు. సైరన్, ఎలాంటి ఆర్బాటం లేకుండా ఆ వాహనంలోనే లంగర్ హౌజ్ పిఎస్ పరిధిలోని ఎండి లైన్స్, ఆశాం నగర్, డిఫెన్స్ కాలనీల్లోని రౌడీ షీటర్ల ఇళ్లకు నేరుగా వెళ్లారు. ఇంట్లోనే ఉన్న రౌడీ షీటర్లను నిద్రలేపి… వారి నేర చరిత్ర, ప్రస్తుత జీవనశైలి, ఉపాధి పరిస్థితులు, సామాజిక వ్యవహార ధోరణులపై ఆరా తీశారు. మళ్లీ నేరాల వైపు అడుగు వేస్తే కఠిన చర్యలు తప్పవని వారిని హెచ్చరించారు. పెట్రోలింగ్ సిబ్బంది హైదరాబాద్ నగర భద్రత కోసం పోలీసులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, ప్రతి సమస్యకు వెంటనే స్పందించే విధంగా బృందాలు సిద్ధంగా ఉండాలని అధికారులకు సిపి విసి సజ్జనార్ ఆదేశించారు. నేర ప్రవృత్తి వీడి సన్మార్గంలోకి రావాలని వారికి హితవు పలికారు.