మన తెలంగాణ/హైదరాబాద్: పారిశ్రామిక భూ ముల కన్వర్షన్ కోసం ఇంపాక్ట్ ఫీజు వసూలు చే యాలని నిర్ణయిస్తే దానిని 5-లక్షల కోట్ల కోణంగా చిత్రీకరిస్తూ కేటీఆర్ దుష్ప్రచారం సాగిస్తున్నారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మండిపడ్డారు. ప్రభుత్వం పరిశ్రమల కు లీజుకిచ్చిన భూములపై యాజమాన్య హక్కు లు కల్పిస్తూ ‘ఫ్రీహోల్డ్’ రైట్స్ పేరిట 2023 ఆగస్టు లో మూడు జిఓలు ఇచ్చింది వారి ప్రభుత్వ హ యాంలో కాదా అని ఆయన ప్రశ్నించారు. శుక్రవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ ఆరోపణలను ఆధారాలతో సహా తిప్పికొట్టారు. కేటీఆర్ చెబుతున్న 9,292 ఎకరాల భూమిలో పరిశ్రమలకు ప్లాటింగ్ చేసి కేటాయించినది 4740 ఎకరాలే అని, మిగిలిన భూమి రోడ్లు, డ్రెనేజీ లాంటి మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగించడం జరిగిందన్నారు.
ఈ కేటాయింపులు ఒక్కరోజులో చేసినవి కాదని, పరిశ్రమల అభివృద్ధి కోసం దశాబ్దాల కాలంగా ఇస్తూ వచ్చినవని, ఆజమాబాద్, కూకట్ పల్లి, హఫీజ్ పేటల్లోని పరిశ్రమల భూములను ఫ్రీ హోల్ పేరిట యాజమాన్య హక్కులు కల్పించినది బిఆరెఎస్ ప్రభుత్వమే అని వెల్లడించారు. కూకట్ పల్లి, ఆజమాబాద్, హఫీజ్ పేట భూములకు సంబంధించి పరిశ్రమల శాఖ జిఓ ఎంస్ 19, 20, 21 లను 2023 ఆగస్టు 29 న జారీ చేసిందని, ఇప్పుడు ఆ భూములకు కన్వర్షన్ అవకాశం కల్పిస్తున్నామన్నారు. 30, 50 శాతం శ్లాబ్ లతో ఇంపాక్ట్ ఫీజు నిర్ణయిస్తూ ఈనెల 17 న జరిగిన కేబినెట్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశారు. 2023లో ఎన్నికలకు నాలుగు నెలల ముందు ఫ్రీహోల్ హక్కులు కల్పించారని, అప్పుడు ఎన్ని లక్షల కోట్లు వసూలు చేసుకున్నారో చెప్పాలన్నారు. ఆ జిఓల విషయం దాచిపెట్టి ప్రభుత్వంపై నిరాధార నిందలు వేస్తున్నారని ఆరోపించారు.
ఓటమితో కేటీఆర్ కు పగలే చుక్కలు : జూబ్లీహిల్స్ ఎన్నికల ఓటమితో కేటీఆర్ కు పగలే చుక్కలు కనిపిస్తున్నాయని మంత్రి శ్రీధర్ బాబు విమర్శించారు. వారి పార్టీ ప్రసార సాధనాలు ఎన్నికలో భారీ మెజారిటీతో గెలుస్తున్నట్టు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాయని, ఇప్పుడు వారి పత్రికలే లేని దానిని కుంభకోణంగా అభివర్ణిస్తే నమ్మే పరిస్థితి లేదన్నారు. అసలు కుంభకోణమో, స్కామో జరిగి ఉంటే వారి హయాంలోనే జరిగి ఉండాలని, పరిశ్రమల యజమానులు హక్కుల పొందాలంటే రిజిస్ట్రేషన్ విలువపై 100 శాతం చెల్లించాలని, అవి చేతులు మారితే 200 శాతం కట్టాలని జిఓలు ఇచ్చారన్నారు. ఆ భూములు మరొకరి పరమైతే హక్కులు ఎలా కల్పిస్తారో వారికే తెలియాలని, వారిచ్చిన యాజమాన్య హక్కులు ఉన్నవారికి భూ వినియోగ మార్పిడి చేసుకునే అవకాశం మాత్రమే తాము కల్పించామన్నారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ, పరిశ్రమల కమిషనర్లు పరిశ్రమల సంఘాలతో పలు దఫాలుగా చర్చలు జరిపిన మీదట 30 శాతం, 50 శాతం శ్లాబ్లను ప్రతిపాదించారని వివరించారు.
అభూత కల్పనలు ప్రచారం చేస్తారా : సిఎం సోదరులు అగ్రిమెంట్లు చేసుకున్నారని నోటికొచ్చినట్లు మాట్లాడారని, వారెవరూ ప్రభుత్వంలో లేరని మంత్రి శ్రీధర్బాబు అన్నారు. పదేండ్లు మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇలా అభూత కల్పనలు ప్రచారం చేయడం దుర్మార్గం అని, ఆధారాలేవైనా బయటపెడితే ప్రభుత్వం ఏం చేయాలో అది చేస్తుందని, ఇప్పటికైనా ఆయన ఆలోచనల్లో మార్పు రావాలని కోరుకుంటున్నామన్నారు. కన్వర్షన్ ఇంపాక్ట్ ఛార్జీల వల్ల రూ.4 వేల నుంచి రూ.5 వేల కోట్ల ఆదాయం వస్తుందని భావిస్తున్నామన్నారు. యాజమాన్య హక్కులు లేనివారు కన్వర్షన్ కు దరఖాస్తు చేసుకోలేరని, ఆర్థిక ఆరాచకత్వానికి పాల్పడి వెళ్లి పోతే రెండేళ్లుగా దానిని సరిదిద్దుతూ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని గుర్తు చేశారు. రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకోవాలని సిఎం రేవంత్ రెడ్డి ప్రయత్నాలకు గండికొట్టాలని చూడటమే బిఆరెస్ ప్రధాన కార్యక్రమంగా మారిందని విమర్శించారు.
బెదిరింపు ధోరణులు మానుకోవాలి : హైదరాబాద్ ను గ్లోబల్ సిటీగా అభివృద్ధి చేసేందుకు పాటుపడుతున్నామని మంత్రి శ్రీధర్బాబు పునరుద్ఘాటించారు. ప్రతిపక్షంగా సహకరించక పోయినా ఫర్వాలేదని, అబద్ధాలతో ప్రతిష్ఠకు భంగం కలిగించే ప్రయత్నాలు చేయవద్దని, బెదిరింపు ధోరణులు మానుకోవాలని హితవు పలికారు. ఓఆర్ ఆర్ లోపల ఉన్న పరిశ్రమలను వెలుపలకు తరలిస్తామని, మొదటి నుంచి చెబుతున్నామని, గాలి, నీరు కాలుష్యం లేకుండా చేయడానికి పరిశ్రమలను బయటకు తరలిస్తున్నామని స్పష్టం చేశారు. పరిశ్రమలను ఆకర్షించడానికి కొన్ని రాష్ట్రాలు ఎకరం భూమిని 99 పైసలకే కేటాయించడం చూస్తున్నామన్నారు. విద్యుత్తు, పన్ను రాయితీలను 20 ఏళ్ల పాటు ఇస్తున్నారని, పరిశ్రమలకు అనుకూలమైన ఎకోసిస్టం ఉండాలని అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. పరిశ్రమలు, ఐటీ కంపెనీలు వస్తే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని, రాష్ట్రం కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని వెల్లడించారు.