కరీంనగర్: సర్పంచ్ ఎన్నికలు జరపకపోవడం వల్ల గ్రామాలు వల్లకాడులుగా మారాయని బిజెపి ఎంపి ఈటల రాజేందర్ తెలిపారు. బల్బులు పెట్టే వాళ్ళు లేరని, మురికి కాలువలు సాఫ్ చేసేవారు లేరని విమర్శించారు. గురువారం ఈటల మీడియాతో మాట్లాడారు. ప్రజల అవసరాలను పట్టించుకునే నాధుడే లేడని, 15 ఫైనాన్స్ కమిషన్ నిధులు, ఫర్ క్యాపిటా నిధులు ఎన్నికలు జరగకుంటే రావు అని, అవి వస్తేనే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుందన్నారు. రెండేళ్లుగా అభివృద్ధి కుంటుపడిందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గుర్తు ఉండదని, గ్రామాల్లో ఉండి ప్రజలకు సేవ చేసి సమస్యలను పరిష్కరిస్తానని విశ్వాసం కల్పించే వారిని ఎన్నుకుంటారని తెలియజేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎక్కువ మందిని గెలిపించడానికి బిజెపి నాయకుడిగా తన ప్రయత్నం చేస్తున్నానని, బిల్లులు రాక సర్పంచులు, ఉపసర్పంచ్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, బకాయిలన్నీ వెంటనే చెల్లించి పోటీ చేసే వారిలో విశ్వాసాన్ని నెలకొల్పాలని ఈటల డిమాండ్ చేశారు. మా నాయకుల మధ్య విభేదాలు ఉన్నాయనేది కొన్ని ఛానెల్స్, యూ ట్యూబ్ చానల్స్, సోషల్ మీడియా సృష్టిస్తున్నాయని మండిపడ్డారు.